Page Loader
Infosys: ట్రైనీలకు షాకిచ్చిన ఇన్ఫోసిస్.. 400 మంది తొలగింపు
ట్రైనీలకు షాకిచ్చిన ఇన్ఫోసిస్.. 400 మంది తొలగింపు

Infosys: ట్రైనీలకు షాకిచ్చిన ఇన్ఫోసిస్.. 400 మంది తొలగింపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 07, 2025
03:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలు కొన్ని ఉద్యోగుల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలు కొత్తవి కావు. వాటిలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. కరోనా సమయంలో ఫ్రెషర్ల పట్ల ఇన్ఫోసిస్ తన కఠిన వైఖరిని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. నియామక ప్రక్రియలో భారీ ఆలస్యం చేసింది. ఆఫర్ లెటర్‌లో పేర్కొన్న వార్షిక వేతనం కంటే తక్కువ ఆఫర్‌తో చేరాలనే షరతులను విధించిందని అప్పట్లో ఆరోపణలొచ్చాయి. పరీక్షల పేరుతో కొందరిని తిరస్కరించిందన్న అభియోగాలు కూడా వినిపించాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మెరుగుపడడంతో ఐటీ కంపెనీలు మళ్లీ నియామక ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి

Details

400 మంది ట్రైనీలకు ఉద్వాసన 

తాజాగా ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్‌లో శిక్షణ పొందుతున్న 400 మంది ట్రైనీలను తొలగిస్తున్నట్లు సమాచారం. వరుసగా మూడు సార్లు అంచనా పరీక్షల్లో విఫలమైన ట్రైనీలకు సంస్థ ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. రెండున్నర సంవత్సరాల నిరీక్షణ తర్వాత శిక్షణ పొందిన వారిలో సగం మందిని తొలగించేయడం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఇన్ఫోసిస్ స్పందన ఈ వ్యవహారంపై ఇన్ఫోసిస్ కీలక ప్రకటన విడుదల చేసింది. సంస్థలో ఫ్రెషర్లు శిక్షణ పూర్తయిన తర్వాత అంతర్గత అంచనాలను తప్పనిసరిగా క్లియర్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. మూడు అవకాశాలు ఇచ్చినా పాస్ కాకపోతే ఉద్యోగంలో కొనసాగించే అవకాశం లేదని వెల్లడించింది. క్లయింట్లకు అత్యున్నత స్థాయి నైపుణ్యం కలిగిన ఉద్యోగులను అందించాలనే ఉద్దేశంతోనే ఈ నియమావళిని పాటిస్తున్నామని పేర్కొంది.

Details

ట్రైనీల ఆందోళన

ట్రైనీలను 50 మందితో కూడిన బ్యాచ్‌లుగా పిలిచి, ఉద్యోగ విరమణ ఒప్పంద పత్రాలపై సంతకం చేయిస్తున్నట్లు సమాచారం. పరీక్షలు కావాలనే కఠినంగా పెట్టారని, తమకు సముచిత అవకాశం ఇవ్వలేదని, భవిష్యత్తు గురించి ఆలోచించగానే భయం వేస్తోందని ఓ ట్రైనీ వాపోయాడు. ఇక ట్రైనీలు తమ మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లకుండా ఉండేందుకు భద్రతా సిబ్బందిని మోహరించారని వర్గాలు చెబుతున్నాయి.

Details

సాయంత్రం 6 గంటలలోపు క్యాంపస్‌ను ఖాళీ చేయాలంటూ ఆదేశాలు

సాయంత్రం 6 గంటలలోపు క్యాంపస్‌ను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై నసెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయీస్‌ సెనెట్‌ (NITES) కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. ఈ కార్పొరేట్ దోపిడీని ఆపాలని, భారతీయ ఐటీ ఉద్యోగుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని NITES ప్రతినిధి హర్ప్రీత్ సింగ్ సలూజా పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ అంశంపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.