
Microsoft: ఏఐ వ్యవస్థలను రూపొందించిన మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు.. వాటివల్లే ఉద్యోగాలు కోల్పోయారు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ ఇటీవల తన ఉద్యోగుల్లో మూడుశాతం మందిని తొలగించింది.
ఈ చర్యతో గ్లోబల్గా సుమారుగా 6,000 మంది ఉద్యోగులు ప్రభావితులయ్యారు.
సంస్థ కార్యకలాపాల్లో కృత్రిమ మేధ (AI) వినియోగాన్ని మరింతగా విస్తరించేందుకు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాల నేపథ్యంలో ఈ లేఆఫ్లు చోటుచేసుకున్నట్టు సమాచారం.
ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసిన ఇంజినీర్లు ఈ తొలగింపులకు గురయ్యారన్నది అంతర్జాతీయ మీడియా కథనం.
వివరాలు
తొలగింపుల్లో 40 శాతం మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు
వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న మైక్రోసాఫ్ట్ శాఖలో తొలగింపుల్లో 40 శాతం మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
కంపెనీ యాజమాన్యం ఇప్పటికే కొన్ని నెలల క్రితం తమ సిబ్బందికి ఏఐ ఆధారిత టూల్స్ను ఉపయోగించి పనితీరు మెరుగుపరచాలని సూచించినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో కొంతమంది ఉద్యోగులు ఏఐ టూల్స్తో వ్యవస్థలు రూపొందించారు.
అయితే, ఇప్పుడు అదే వ్యవస్థలు వారి ఉద్యోగాలను భర్తీ చేస్తోందంటే , వారు రూపొందించిన టెక్నాలజీ వారినే బలితీసుకునే పరిస్థితి నెలకొంది.
వివరాలు
పదవిని కోల్పోయిన ఏఐ డైరెక్టర్ గాబ్రియెలా డికీరోజ్
మైక్రోసాఫ్ట్లో ఉన్న ఒక సీనియర్ అధికారి జెఫ్ హల్స్ తన ఆధ్వర్యంలోని 400 మంది ఉద్యోగులకు కనీసం 50 శాతం కోడ్ను ఓపెన్ఏఐ చాట్బాట్ల సహాయంతో తయారు చేయాలన్న సూచన ఇచ్చారు.
కొన్ని వారాల అనంతరం జరిపిన తొలగింపుల్లో ఆ బృందంలోని ఉద్యోగులూ ప్రభావితులయ్యారు.
దీన్నిబట్టి చూస్తే, వారు చేసిన మార్గమే చివరికి వారిని ఉద్యోగరహితులను చేసింది.
ఈ తాజా తొలగింపుల్లో జూనియర్ కోడర్లు,ప్రొడక్ట్ మేనేజ్మెంట్,టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ విభాగాల్లోని ఉద్యోగులు, అలాగే ఏఐ ప్రాజెక్టుల్లో పనిచేసే సిబ్బందిని కూడా అందులో భాగం చేశారు.
అంతేకాదు, మైక్రోసాఫ్ట్కు చెందిన స్టార్టప్ విభాగంలో ఏఐ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న గాబ్రియెలా డికీరోజ్ కూడా తన పదవిని కోల్పోయారు.
వివరాలు
2023లో 10,000 మంది ఉద్యోగుల తొలగింపు
ఈ విషయంలో ఆమె స్పందిస్తూ - ''ఇది చేదు రుచి కలిగిన తీపి'' అని వ్యాఖ్యానించారు. తాము చేసిన కృషి విలువలేనిదిగా మారిపోవడం బాధాకరమని ఆమె భావోద్వేగంతో చెప్పారు.
ఇది మైక్రోసాఫ్ట్ జరిపిన రెండవ అతిపెద్ద తొలగింపు. 2023లో సంస్థ సుమారు 10,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది.
తాజాగా జరిగిన ఈ చర్యతో సంస్థ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ విషయమై మైక్రోసాఫ్ట్ ప్రతినిధి స్పందిస్తూ - ''మేము మార్కెట్లో పోటీలో ముందుండేందుకు అవసరమైన పునర్వ్యవస్థీకరణ చర్యలు తీసుకుంటున్నాం. మేనేజ్మెంట్ స్థాయిలను తగ్గించి, సంస్థ కార్యకలాపాలను సమర్థవంతంగా మార్చడం మా లక్ష్యం'' అని తెలిపారు.
వివరాలు
మైక్రోసాఫ్ట్లో 30% కోడింగ్ ఏఐ రాస్తోంది : సత్య నాదెళ్ల
గత నెల మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మాట్లాడుతూ - తమ సంస్థలో ప్రస్తుతం 30 శాతం కోడింగ్ను కృత్రిమ మేధ ఆధారంగా చేసుకునే టూల్స్ ఉపయోగించి తయారు చేస్తున్నట్లు చెప్పారు.
నాణ్యతను పెంచేందుకు ఏఐ ఆధారిత పరిష్కారాలవైపు సంస్థ అడుగులు వేస్తోందన్నారు. ఈ వ్యాఖ్యల తర్వాత కొద్ది రోజుల్లోనే 3 శాతం ఉద్యోగుల తొలగింపు ప్రకటన వెలువడటం గమనార్హం.