
Stock market: వరుసగా రెండోరోజూ నష్టాల్లోకి జారుకున్న దేశీయ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండవ రోజూ నష్టాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)ఈసారి కీలక వడ్డీ రేట్లను యథావిధిగా కొనసాగించాలని తీసుకున్న నిర్ణయం మార్కెట్పై ప్రభావం చూపించింది. ఈ నిర్ణయం మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఉన్నప్పటికీ, వడ్డీ రేట్ల మార్పులపై అధికంగా ప్రభావితమయ్యే షేర్లలో అమ్మకాలు జరిగి సూచీలు దిగజారిపోయాయి. ఇక మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చిన వాణిజ్య సుంకాల హెచ్చరికలు కూడా మార్కెట్ను ఒత్తిడిలోకి నెట్టాయి. భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు గాను,వచ్చే 24గంటల్లో భారత్పై టారిఫ్లు (సుంకాలు) విధిస్తానని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా,ఫార్మా రంగం,సెమీకండక్టర్ పరిశ్రమపై కూడా సుంకాలు విధించే ఉద్దేశం ఉన్నట్లు ఆయన ప్రకటించడంతో మదుపర్లు అప్రమత్తమయ్యారు.
వివరాలు
నిఫ్టీ @ 24,600
ఈ పరిణామాల మధ్య, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (సెన్సెక్స్) సూచీ 80,694.98 పాయింట్ల వద్ద ప్రారంభమైంది, ఇది గత ముగింపు స్థాయి అయిన 80,710.25 కంటే తక్కువ. ట్రేడింగ్ మొత్తం వ్యవధిలో ఒడిదొడుకులు ఎదుర్కొన్న ఈ సూచీ,చివరికి 166.26 పాయింట్లు కోల్పోయి 80,543.99 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (నిఫ్టీ) సూచీ 75.35 పాయింట్లు పడిపోయి,24,600 స్థాయిని కోల్పోయింది. చివరికి ఇది 24,574.20 వద్ద స్థిరపడింది.డాలర్తో రూపాయి మారకం విలువ 87.73గా నమోదు అయ్యింది. సెన్సెక్స్లోని 30 కీలక షేర్లలో సన్ఫార్మా, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిశాయి.
వివరాలు
బంగారం ఔన్సు 3419 డాలర్ల వద్ద ట్రేడవుతోంది
ఇదిలా ఉండగా, ఏషియన్ పెయింట్స్, బీఈఎల్, ట్రెంట్, అదానీ పోర్ట్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) షేర్లు మాత్రం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్కు 68.69 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ధర కూడా పెరుగుతూ ఔన్సు ధర 3419 డాలర్లకు చేరుకుంది.