
Stock market: భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 873 పాయింట్లు, నిఫ్టీ 261 పాయింట్లు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న బలహీన సంకేతాలు, విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు మార్కెట్ మనోభావాన్ని బలహీనంగా చేశాయి.
అంతేకాదు, మార్కెట్ గరిష్ఠాలను చేరిన తరుణంలో మదుపర్లు లాభాలను గణించుకోవడంతో అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగింది.
ప్రారంభంలో లాభాల్లో ప్రారంభమైన సూచీలు, తర్వాత వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి.
వివరాలు
దాదాపు రూ.3.50 లక్షల కోట్లు క్షిణించిన మార్కెట్ విలువ
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 872.98 పాయింట్లు పడిపోయి 81,186.44 వద్ద ముగిసింది.
నిఫ్టీ సూచీ 261.55 పాయింట్లు కోల్పోయి 24,683.90 స్థాయికి చేరింది. నిఫ్టీ ఆటో సూచీ 2 శాతం కంటే ఎక్కువ నష్టపోయింది, అలాగే నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ రంగాల్లోని షేర్లు 1 శాతానికి పైగా పడిపోయాయి.
మిడ్క్యాప్ 100 సూచీ 1.62 శాతం తగ్గగా, స్మాల్క్యాప్ సూచీ 0.94 శాతం దిగజారింది.
బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.3.50 లక్షల కోట్ల మేర క్షీణించి, రూ.440.23 లక్షల కోట్లకు చేరింది.
వివరాలు
సెన్సెక్స్, నిఫ్టీ ట్రేడింగ్ వివరాలు
ఈరోజు ఉదయం సెన్సెక్స్ 82,116.17 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది (గత ముగింపు 82,059.42). అయితే, కొద్దిసేపటికే సూచీ నష్టాల్లోకి జారుకుంది.
ఇంట్రాడేలో 81,153.70 కనిష్ఠ స్థాయిని తాకిన తర్వాత చివరికి 81,186.44 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సూచీ 24,683.90 వద్ద ముగిసింది.
రూపాయి మారకం విలువ డాలరుతో పోల్చితే రూ.85.63గా నమోదైంది.
సెన్సెక్స్లోని 30 షేర్లలో టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఐటీసీ తప్ప మిగిలిన అన్నీ నష్టాల్లో ముగిశాయి.
ముఖ్యంగా ఎటర్నల్, మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్గ్రిడ్ కార్పొరేషన్ వంటి షేర్లు అత్యధికంగా నష్టపోయాయి.
వివరాలు
ముఖ్య కారణాలు ఇవే:
యూఎస్ క్రెడిట్ రేటింగ్ తగ్గుదల: అమెరికా ప్రభుత్వం అప్పులపై కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో మూడీస్ యుఎస్ క్రెడిట్ రేటింగ్ను తగ్గించింది. దీని ప్రభావంగా అక్కడి 30 ఏళ్ల బాండ్ రాబడులు 2023 నవంబర్ తర్వాత అత్యధికంగా 5.03 శాతానికి చేరాయి. దీని వల్ల భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లలో లిక్విడిటీ తక్కువవుతుందన్న భయాలు ఉద్భవించాయి.
విదేశీ మదుపర్ల అమ్మకాలు: ఇటీవల కొన్ని రోజులుగా కొనుగోళ్లకు మొగ్గుచూపిన విదేశీ సంస్థాగత మదుపర్లు మే 19న అమ్మకాలకు దిగారు. ఈ రోజు వారు రూ.526 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అంతేకాక, దేశీయ సంస్థాగత మదుపర్లు కూడా రూ.238 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.
వివరాలు
ముఖ్య కారణాలు ఇవే:
లాభాల స్వీకరణ: భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో మార్కెట్ సూచీలు ఇటీవల గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే.
ఈ పెరుగుదల అనంతరం సుమారు 4 శాతం వరకు లాభాలు నమోదవడంతో మదుపర్లు లాభాలను వసూలు చేసేందుకు అమ్మకాలకు దిగారు.
ప్రధాన షేర్ల అమ్మకాలు: హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ వంటి పెద్ద స్టాక్స్లో విక్రయాలు పెరగడం సూచీలపై ఒత్తిడిని పెంచింది.
కొవిడ్ కేసుల పెరుగుదల: కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న వార్తలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి.
ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్ దేశాల్లో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.
భారత్లోని కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు బయటపడుతుండటంతో మార్కెట్లో నిరాశ నెలకొంది.