Page Loader
Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ.. లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు
లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు

Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ.. లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 02, 2025
09:57 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు దేశీయంగా సానుకూల వాతావరణాన్ని కల్పించాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి ప్రముఖ సంస్థల షేర్లలో కొనుగోళ్లతో మార్కెట్లు పాజిటివ్‌గా కదులుతున్నాయి. ఉదయం 9:25 గంటల సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 424 పాయింట్ల పెరుగుదలతో 80,666 వద్ద ట్రేడవుతుండగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 24,422 వద్ద కొనసాగింది.

వివరాలు 

బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 62.62 డాలర్లు 

సెన్సెక్స్‌కు చెందిన 30 ప్రముఖ స్టాక్‌లలో అదానీ పోర్ట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇదే సమయంలో నెస్లే ఇండియా, టైటాన్‌, ఎటర్నల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ఫార్మా, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌ పరంగా బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 62.62 డాలర్ల వద్ద ఉండగా, బంగారం ఔన్సు ధర 3,262.20 డాలర్లకు చేరింది.

వివరాలు 

స్థిరంగా చైనా షాంఘై మార్కెట్‌ 

అమెరికా స్టాక్‌ మార్కెట్లు గత ట్రేడింగ్‌ సెషన్‌లో లాభాలతో ముగిశాయి. డోజోన్స్‌ ఇండెక్స్‌ 0.21 శాతం పెరుగుదల చూపించగా,ఎస్‌అండ్‌పీ 500 సూచీ 0.63 శాతం,నాస్‌డాక్‌ 1.52 శాతం లాభాలను నమోదు చేశాయి. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు కూడా ఇదే ధోరణిలో కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా మార్కెట్‌లో ఏఎస్‌ఎక్స్‌ 0.84 శాతం లాభపడగా,జపాన్‌ నిక్కీ 0.69 శాతం పెరిగింది. అయితే చైనా షాంఘై మార్కెట్‌ స్థిరంగా ఉంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మార్కెట్‌లో మళ్లీ కొనుగోళ్ల పంథాలోకి వస్తున్నారు. బుధవారం రోజున వీరు నికరంగా రూ.51 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. మరోవైపు దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) కూడా మార్కెట్‌కు మద్దతుగా నిలుస్తూ రూ.1792 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేశారు.