Page Loader
Stock Market: కార్పొరేట్‌ సంస్థల మూడో త్రైమాసిక ఫలితాలపై ఫోకస్‌.. నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు
కార్పొరేట్‌ సంస్థల మూడో త్రైమాసిక ఫలితాలపై ఫోకస్‌.. నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు

Stock Market: కార్పొరేట్‌ సంస్థల మూడో త్రైమాసిక ఫలితాలపై ఫోకస్‌.. నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2025
10:03 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ తొలుత స్థిరంగా ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు కొంతకాలానికే నష్టాల్లోకి జారిపోయాయి. కార్పొరేట్ సంస్థల త్రైమాసిక ఫలితాలు త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు, దీని ప్రభావంతో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్ 259 పాయింట్లు తగ్గి 77,915 వద్ద ట్రేడవుతుండగా,నిఫ్టీ 69 పాయింట్లు కుంగి 23,619 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, జొమాటో,టాటా స్టీల్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతుండగా, కోటక్ మహీంద్రా బ్యాంక్,ఎంఅండ్‌ఎం,ఏషియన్ పెయింట్స్,ఇన్ఫోసిస్ షేర్లు లాభాలను నమోదు చేస్తున్నాయి.

వివరాలు 

మిశ్రమ ధోరణిలో ఆసియా-పసిఫిక్ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 76.12 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 2,678.40 రూపాయల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.92 వద్ద నిలిచింది. అమెరికా మార్కెట్లు బుధవారం స్థిరంగా ముగిసిన నేపథ్యంలో, ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు మిశ్రమ ధోరణిలో కదలాడుతున్నాయి. ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 0.33 శాతం, జపాన్ నిక్కీ 0.76 శాతం, షాంఘై 0.73 శాతం నష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 0.26 శాతం లాభంతో కొనసాగుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) బుధవారం నికరంగా 3,362 కోట్ల రూపాయల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) 2,716 కోట్ల రూపాయల షేర్లను కొనుగోలు చేశారు.