
Stock market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 25వేల పైకి నిఫ్టీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. ప్రపంచవ్యాప్తంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నా,భారత మార్కెట్లు ప్రతికూల పరిస్థితులను అధిగమించి మంచి ప్రదర్శన చూపడం విశేషం.
గత మూడు సెషన్ల వరుస నష్టాలకు ఈ రోజు ముగింపు పలుకుతూ మార్కెట్ మళ్లీ పాజిటివ్ ట్రాక్లోకి వచ్చింది.
ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, ఆటోమొబైల్, మెటల్స్ రంగాల్లో జరిగిన శక్తివంతమైన కొనుగోళ్లే మార్కెట్ల లాభాలకు ప్రధాన ఆధారంగా నిలిచాయి.
ఈ ప్రభావంతో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలూ మెరుగైన ప్రదర్శన కనబరిచాయి.
వివరాలు
సూచీ నిఫ్టీ 319 పాయింట్లు లాభపడి 25,112.40
ఈ నేపథ్యంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 1,000కు పైగా పాయింట్ల లాభంతో 82,408.17 వద్ద ముగిసింది.
అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 319 పాయింట్లు లాభపడి 25,112.40 వద్ద స్థిరమైంది.
ఈరోజు మార్కెట్లో BSEలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.4 లక్షల కోట్లకు పైగా పెరిగింది.
మొత్తంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.446.37 లక్షల కోట్లకు చేరుకుంది.
సెన్సెక్స్ ఉదయం నెమ్మదిగా మొదలైంది కానీ తరువాత వేగం పెంచింది .
ఉదయం మార్కెట్ సెన్సెక్స్ 81,354.85 పాయింట్ల వద్ద స్థిరంగా ప్రారంభమైంది (మునుపటి ముగింపు 81,361.87 పాయింట్లు).
వివరాలు
సెన్సెక్స్ షేర్లలో లాభాలు - మినహాయింపుగా మారుతీ సుజుకీ
అయితే ప్రారంభానంతరం బలపడిన మార్కెట్ రోజంతా లాభాల్లోనే కొనసాగింది.
ట్రేడింగ్ సమయంలో 82,494.49 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకిన తరువాత చివరికి 1,046.30 పాయింట్ల లాభంతో ముగిసింది.
రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే 86.59గా నమోదైంది. సెన్సెక్స్ 30 షేర్లలో మారుతీ సుజుకీ తప్ప మిగిలిన అన్ని షేర్లు లాభాల్లో ముగిశాయి.
ముఖ్యంగా భారతీ ఎయిర్టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా వంటి కంపెనీలు మార్కెట్ లాభాలను ముందుండి నడిపించాయి.
వివరాలు
అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితి
అంతర్జాతీయ మార్కెట్ల విషయానికి వస్తే, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కి 76 డాలర్ల వద్ద ఉంది.
బంగారం ధర ఔన్సుకు 3372 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
వీటి ప్రభావం కూడా మార్కెట్ మానసికస్థితిపై కొంత మేరకు కనిపించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
ఇంత భారీ లాభాలకు కారణాలు ఏమిటంటే...
ఇటీవల జరిగిన వరుస నష్టాల నేపథ్యంలో మార్కెట్ ఆకర్షణీయ స్థాయికి చేరుకోవడంతో మదుపర్లు కొనుగోళ్లకు ముందుకు వచ్చారు.
గత మూడు ట్రేడింగ్ సెషన్లలో విదేశీ సంస్థాగత మదుపర్లు కొనుగోళ్లపై దృష్టిసారించడంతో మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్ ఏర్పడింది.
అంతేకాకుండా డాలర్ సూచీ క్షీణించి 98.57 స్థాయికి పడిపోవడంతో విదేశీ పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో మన మార్కెట్లు లాభాల బాట పట్టాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.