Page Loader
Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు.. నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు 
నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు

Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు.. నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 11, 2025
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు మార్కెట్‌పై ఒత్తిడిని పెంచాయి. అమెరికా టారిఫ్‌ల ప్రకటనలు, ఆ దేశంలో నిరుద్యోగిత పెరుగుదల వంటి పరిణామాల కారణంగా మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ ప్రభావంతో, మార్కెట్‌ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్‌ 230 పాయింట్లు కోల్పోయి, నిఫ్టీ 23,350 దిగువకు చేరుకుంది.

వివరాలు 

113 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ

ఉదయం 9:30 గంటల సమయానికి, సెన్సెక్స్‌ (Sensex) 388 పాయింట్లు నష్టపోయి 73,726 వద్ద, నిఫ్టీ (Nifty) 113 పాయింట్లు క్షీణించి 22,346 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, జొమాటో, ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ నష్టాల్లో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, సన్‌ఫార్మా, మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, ఐటీసీ, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 70 డాలర్ల దిగువన కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 2,899.60 డాలర్ల వద్ద ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 87.38 వద్ద స్థిరంగా ఉంది.

వివరాలు 

భారీ నష్టాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు 

సోమవారం, అమెరికా స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. ఎస్‌అండ్‌పీ సూచీ 2.69 శాతం, డోజోన్స్‌ 2.08 శాతం పడిపోగా, నాస్‌డాక్‌ 4 శాతం నష్టపోయింది. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా బలహీనంగా ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ 0.78 శాతం, జపాన్‌ నిక్కీ 1.74 శాతం నష్టాల్లో కదలాడుతున్నాయి. షాంఘై, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) సోమవారం నికరంగా రూ.485 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.264 కోట్ల షేర్లు కొనుగోలు చేశారు.