
Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ @25,090
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఈరోజు పాజిటివ్ జోన్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.17 గంటల సమయంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 148 పాయింట్లు ఎగసి 82,006 మార్క్ను చేరగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 39 పాయింట్లు పెరిగి 25,090 వద్ద కొనసాగింది. హాట్సన్ అగ్రో,జూపిటర్ వెగన్స్,కాంకర్డ్ బయోటెక్,గ్రాన్యుల్స్ ఇండియా,ఐటీఐ లాంటి కంపెనీల షేర్లు లాభాల్లో ఉన్నాయి. మరోవైపు క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నజారా టెక్నాలజీస్,ఫైన్ ఆర్గానిక్, ఎన్ఐఐటీ లెర్నింగ్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రధాన రంగాలన్నింటికీ చెందిన సూచీలు ఈరోజు పెరుగుదల దిశలో కదులుతున్నాయి. ఇటీవల జీవిత,ఆరోగ్య బీమాపై జీఎస్టీ తొలగింపు వంటి కీలక నిర్ణయాలు పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచాయి.
వివరాలు
రూపాయి విలువ డాలర్తో పోలిస్తే స్వల్పంగా బలపడింది
దీనితో పాటు భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా, స్థిరంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చేసిన వ్యాఖ్యలు మార్కెట్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించాయి. అంతర్జాతీయంగా ఆసియా-పసిఫిక్ ప్రాంత మార్కెట్ సూచీలు మిశ్రమ రీతిలో కదులుతున్నాయి. చైనాలోని షాంఘై, షెంజెన్ సూచీలు, దక్షిణ కొరియా కోస్పి, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 200, న్యూజిలాండ్ ఎన్జెడ్ఎక్స్ 50, తైవాన్ సూచీలు లాభాల్లో ఉండగా, జపాన్ నిక్కీ, హాంకాంగ్ హెచ్ఎస్ఐ మాత్రం నష్టపోతున్నాయి. కరెన్సీ మార్కెట్లో రూపాయి విలువ డాలర్తో పోలిస్తే స్వల్పంగా బలపడింది. ప్రస్తుతం రూపాయి మారకం రేటు రూ.87.03 వద్ద కొనసాగుతోంది.