
Telsa: ఏప్రిల్ నుండి భారత్లో దిగుమతి చేసుకున్నటెస్లా EVల విక్రయం..!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా ఈవీ దిగ్గజం టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ దేశంలో నియామక ప్రక్రియను ప్రారంభించింది.అంతేకాదు,షోరూంల ఏర్పాటు కోసం కూడా ప్రయత్నాలు సాగిస్తోంది. తాజా కథనాల ప్రకారం,ఈ ఏడాది ఏప్రిల్ నుంచి టెస్లా తన ఈవీ కార్లను భారత మార్కెట్లో విక్రయించనున్నట్టు సమాచారం. ఈ వాహనాల ప్రారంభ ధర సుమారు రూ.21 లక్షలు ఉండనున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతానికి టెస్లా రిటైల్ కార్యకలాపాలను మాత్రమే ప్రారంభించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో,జర్మనీలోని బెర్లిన్ ప్లాంట్లో ఉత్పత్తి చేసిన ఈవీ కార్లను దిగుమతి చేసుకుని భారత మార్కెట్లో విక్రయించేందుకు టెస్లా సన్నాహాలు చేపట్టింది. షోరూంల ఏర్పాటు కోసం ముంబయిలోని బీకేసీ బిజినెస్ డిస్ట్రిక్ట్,న్యూఢిల్లీలోని ఏరోసిటీ ప్రాంతాలను ఎంపిక చేసినట్లు సమాచారం.
వివరాలు
ఈవీల తయారీపై టెస్లా ఇంకా స్పష్టత ఇవ్వలేదు
టెస్లా తొలుత సుమారు 25,000 డాలర్ల (భారత కరెన్సీలో రూ.21 లక్షలు) ధర కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించనుందని వార్తలు వెలువడుతున్నాయి. అయితే, భారత్లో స్థానికంగా ఈవీల తయారీపై టెస్లా ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కానీ, దేశీయ ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారుల నుంచి విడిభాగాల కొనుగోళ్లను పెంచే ప్రణాళికలు ఉన్నట్లు సమాచారం. టెస్లా 2021 నుంచే భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈవీలపై దిగుమతి సుంకాలను తగ్గించాలని ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా కోరగా, కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది.
వివరాలు
నరేంద్ర మోదీతో ఎలన్ మస్క్ భేటీ
దేశీయంగా ఉత్పత్తి ప్రారంభించడంతో పాటు స్థానికంగా విడిభాగాలను కొనుగోలు చేయాలన్న నిబంధనను పెట్టింది. ఈ క్రమంలోనే ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఎలన్ మస్క్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భారత మార్కెట్లో ఈవీ విక్రయాలపై చర్చించినట్లు సమాచారం. ఇదే నేపథ్యంలో, టెస్లా భారత్లో నియామక ప్రక్రియను ప్రారంభించి, మార్కెట్లోకి ఎంట్రీకి సంకేతాలు ఇస్తోంది.