
UPI set for IoT leap: స్మార్ట్ డివైజులతో ఆటోమేటిక్గా పేమెంట్స్!
ఈ వార్తాకథనం ఏంటి
కారు పార్క్ చేసిన వెంటనే,ఆ కారే స్వయంగా పార్కింగ్ ఫీజు చెల్లించేస్తే ఎలా ఉంటుంది? చేతిలో ఉండే స్మార్ట్వాచ్ సహాయంతో మెట్రో టికెట్ కొనుగోలు చేయగలిగితే? ఇవన్నీ ఊహించలేనివిగా అనిపించవచ్చు. రాబోయే రోజుల్లో ఇది సాధ్యం కాబోతోంది! ఎందుకంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐను ఇంకా స్మార్ట్గా మారుస్తోంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) కు అనుగుణంగా రూపొందించిన యూపీఐ వెర్షన్ను రూపొందిస్తోంది. ఈ నూతన వ్యవస్థ ద్వారా మనిషి జోక్యం లేకుండానే గృహోపకరణాలు, వేరియబుల్ డివైసులు, కనెక్టెడ్ వాహనాలు వంటి వాటి ద్వారా స్వయంగా చెల్లింపులు చేయడం సాధ్యమవుతుంది. అంటే ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు, స్మార్ట్ వాచ్లు వంటి సాధనాలు కూడా యూపీఐ ద్వారా లావాదేవీలు చేయగలవన్నమాట.
వివరాలు
ఆటోమేటెడ్ పేమెంట్ వ్యవస్థలు కూడా ఇలాంటి విధానమే
ప్రస్తుతం యూపీఐ ద్వారా చెల్లింపులు చేయాలంటే మన దగ్గర స్మార్ట్ఫోన్ ఉండాలి. అలాగే,యూపీఐ ఐడీ ఉండాలి. తాజాగా అందుబాటులోకి వచ్చిన యూపీఐ సర్కిల్ పేమెంట్స్ వ్యవస్థతో బ్యాంక్ ఖాతా యజమాని కాకపోయినా,సెకండరీ యూజర్లు కూడా ఆ ఖాతా ద్వారా చెల్లింపులు చేయగలుగుతున్నారు. ఆటోమేటెడ్ పేమెంట్ వ్యవస్థలు కూడా ఇలాంటి విధానమే. ఇప్పుడు NPCI రూపొందిస్తున్న ఈ కొత్త సాంకేతికత కూడా అదే దిశగా ఉంది. ఇందులో వ్యక్తి జోక్యం లేకుండానే చెల్లింపులు జరుగుతాయి.ఈవ్యవస్థలో గృహోపకరణాలు, వాహనాలు వంటి యంత్రాలు వినియోగదారుల ప్రైమరీ ఖాతాలకు లింక్ అవుతాయి. వీటికి ప్రత్యేకమైన యూపీఐ ఐడీ కూడా ఉంటుంది.వన్టైమ్ అథెంటికేషన్ (ఒకసారి అనుమతి) ద్వారా డివైస్ లింక్ అయ్యాక,తదుపరి నుండి యూజర్ జోక్యం లేకుండానే చెల్లింపులు జరిపేయవచ్చు.
వివరాలు
యంత్రణ సంస్థల నుంచి అనుమతుల కోసం ఎన్పీసీఐ ఎదురుచూపు
ఈ ఏడాది జరగనున్న గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్లో ఈ కొత్త IoT ఆధారిత యూపీఐను ప్రదర్శించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం నియంత్రణ సంస్థల నుంచి అనుమతుల కోసం ఎన్పీసీఐ ఎదురుచూస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గత సంవత్సరాల్లో ఇదే ఫెస్టివల్లో యూపీఐ సర్కిల్, భారత్ బిల్ పే సిస్టమ్,యూపీఐ లైట్ ఎక్స్ వంటి పేమెంట్ పరిష్కారాలను NPCI పరిచయం చేసింది. ఈసారి మరింత వినూత్న ఆవిష్కరణతో రంగప్రవేశం చేయబోతోంది.