Page Loader
Tollywood IT Raids: టాలీవుడ్ ప్రముఖుల ఇళ్ళల్లో ముగిసిన ఐటీ సోదాలు
టాలీవుడ్ ప్రముఖుల ఇళ్ళల్లో ముగిసిన ఐటీ సోదాలు

Tollywood IT Raids: టాలీవుడ్ ప్రముఖుల ఇళ్ళల్లో ముగిసిన ఐటీ సోదాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 24, 2025
09:15 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో వరుసగా మూడు రోజుల పాటు ఐటీ సోదాలు జరిగాయి. ఐటీ అధికారులు ఎస్‌వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థలలో తనిఖీలు నిర్వహించారు. దర్శకుడు సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ అధికారులు తనిఖీ చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు ఈ సోదాలు కొనసాగాయని అధికారులు తెలిపారు. ఈ తనిఖీలలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని ఐటీ అధికారులు వెల్లడించినట్టు సమాచారం. దర్శకుడు సుకుమార్ ఇంట్లో రెండు రోజులపాటు విస్తృతంగా తనిఖీలు జరిగాయి. దిల్ రాజు, మరో నిర్మాత బ్యాంకు లావాదేవీలను కూడా సుదీర్ఘంగా పరిశీలించినట్టు సమాచారం.

వివరాలు 

మూడు రోజులు, 16 చోట్ల..

మొత్తం 55 మంది సభ్యులతో 16 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సంక్రాంతి సమయంలో విడుదలైన భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలు,దర్శకులే ఈ సోదాల లక్ష్యంగా ఉన్నారు. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ కంటెంట్ సంస్థ మ్యాంగో మీడియా సంస్థతో పాటు, ప్రముఖ ఫైనాన్స్ సంస్థ సత్య రంగయ్య ఇంట్లో, ఆఫీసులో ఐటీ దాడులు చేశారు. మరో ఫైనాన్సర్, నిర్మాత నెక్కింటి శ్రీధర్ ఇంట్లో కూడా సోదాలు జరిగాయి.

వివరాలు 

ప్రతాపరెడ్డి ఇంట్లో రెండు రోజులపాటు సోదాలు

నెల్లూరుకు చెందిన ప్రతాపరెడ్డి ఇంట్లో రెండు రోజులపాటు సోదాలు నిర్వహించారు. దిల్ రాజు భార్య బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించారు. దిల్ రాజు కార్యాలయంతో పాటు జూబ్లీహిల్స్‌లోని ఉజాస్ విల్లాస్‌లో ఆయన నివాసంలోనూ సోదాలు జరిగాయి. రాజు కుమార్తె హన్సితారెడ్డి, సోదరుడు నర్సింహారెడ్డి, శిరీష్ ఇళ్లలో కూడా ఐటీ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్వాహకులు నవీన్, రవిశంకర్‌లతో పాటు సీఈవో చెర్రీ ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.