
Tollywood : చివరి నిమిషంలో షాక్.. సీఎం చంద్రబాబుతో టాలీవుడ్ భేటీ వాయిదా!
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల థియేటర్ల సమస్యల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టాలీవుడ్పై తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే.
తన సినిమాలకు థియేటర్లు దొరకడం లేదని, పరిశ్రమలోని సమస్యలు పరిష్కారానికి సినీ ప్రముఖులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఎందుకు కలవడం లేదని ప్రశ్నించారు.
దీనిపై స్పందించిన టాలీవుడ్ ప్రముఖులు, ఏపీ సీఎం చంద్రబాబును కలవాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పలువురు టాలీవుడ్ ప్రముఖులకు ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానించారు.
Details
35-40 ప్రముఖులు హాజరయ్యేలా సమాచారం
తొలి విడతగా పవన్ కళ్యాణ్ను కలిసి, అనంతరం ఆయనతో కలిసి సీఎం చంద్రబాబును కలవాలన్నది ప్లాన్. సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబుతో భేటీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈ సమావేశానికి ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, నాగ్ అశ్విన్, నిర్మాతలు అశ్వినీ దత్, దిల్ రాజు, అల్లు అరవింద్, దానయ్య, కెవి రామారావు, హీరోలుగా బాలకృష్ణ, వెంకటేష్, మనోజ్, సుమన్, ఆర్.నారాయణమూర్తి, నాని తదితరులు రావాల్సి ఉంది.
మొత్తంగా 35-40 మంది ప్రముఖులు ఈ భేటీకి హాజరయ్యేలా ఏర్పాట్లు జరిగాయి.
Details
చాలామంది ప్రముఖులు అందుబాటులో లేరు
అయితే చివరి నిమిషంలో ఈ సమావేశం వాయిదా పడింది. దీనికి ప్రధాన కారణం.. పలువురు ప్రముఖులు షూటింగ్స్ కోసం ఇతర రాష్ట్రాల్లో ఉండటమే.
అంతేకాదు టాలీవుడ్లోని కీలక విభాగాల్లో ఉన్నవారు చాలామంది అందుబాటులో లేకపోవడంతో ఈ భేటీని వాయిదా వేసినట్లు సమాచారం.
ఈ సమావేశం వాయిదా పడటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం తరఫున సీఎం, డిప్యూటీ సీఎం పిలిచినా టాలీవుడ్ ప్రముఖులు అందుబాటులో లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
ఈ సమావేశం మళ్లీ ఎప్పుడవుతుందన్నది ఇంకా స్పష్టత లేదు.