అక్కినేనిపై బాలయ్య వ్యాఖ్యలు: స్పందించిన అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్
ఇటీవల వీరసింహారెడ్డి విజయోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. అఖండ తర్వాత బాలయ్య ఖాతాలో మరో హిట్ పడిందని అభిమానులు అందరూ సంబరాలు చేసుకున్నారు. అంతా బానే ఉంది కానీ, విజయోత్సవ కార్యక్రమంలో బాలయ్య మాట్లాడిన మాటలు అక్కినేని అభిమానుల మనసులను గాయపరిచాయి. దాంతో అటు సోషల్ మీడియాలో ఇటు సినిమా ఇండస్ట్రీలో ఇదే చర్చనీయాంశం అయ్యింది. తాజాగా ఈ విషయమై అక్కినేని వారసులు అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ స్పందించారు. "నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వర రావు గారు, ఎస్వీ రంగారావు గారు మన తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరుచుకోవడం మనల్ని మనం కించపర్చుకోవడమే" అని అన్నారు.
సోషల్ మీడియాలో పెరుగుతున్న వివాదం
అక్కినేని గురించి బాలకృష్ణ ఎందుకలా మాట్లాడారో తెలియదు గానీ చివరికి మాత్రం అక్కినేని వారసులు స్పందించారు. దీంతో వారసుల వార్ మొదలైందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఇలాంటి అనవసర వివాదాలు ఇండస్ట్రీకి మంచివి కావని కొందరు హితవు పలుకుతున్నారు. మరి ఈ విషయం ఇక్కడితో సద్దుమణిగి పోతుందో లేదో చూడాలి. సంక్రాంతి కానుకగా వచ్చిన వీరసింహారెడ్డి సినిమా, జనాలను విశేషంగా ఆకట్టుకుంది. మొదట్లో సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఆ తర్వాత దూసుకుపోయింది. ఇప్పటివరకు 100కోట్ల గ్రాస్ సాధించిందని సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజ్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషించారు. శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించింది.