
Malegaon Blast Case: 2008 మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నేడు తుది తీర్పు; నిందితుల భవిష్యత్తుపై ఉత్కంఠ
ఈ వార్తాకథనం ఏంటి
2008 మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు (జూలై 31) తుది తీర్పును ప్రకటించనుంది. దాదాపు 17 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ కేసు చరిత్రలో ఎన్నో చట్టపరమైన మలుపులు తిరిగి, నేడు సుదీర్ఘ విచారణకు ముగింపు పలుకుతోంది. ఈ తీర్పుతో ప్రధాన నిందితులుగా ఉన్నవారి భవిష్యత్తు ఎలా ఉండబోతోందనేది తేలనుంది. ఈ కేసులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరితోపాటు, రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ్, సుధాకర్ చతుర్వేది, అజయ్ రాహిర్కర్, శంకరాచార్య మరియు సమీర్ కులకర్ణి అనే మరో ఐదుగురు నిందితులు కూడా విచారణను ఎదుర్కొన్నారు.
వివరాలు
ద్విచక్ర వాహనంలో అమర్చిన IED బాంబు పేలి ఆరుగురు మృతి
ఈ ఘటన 2008 సెప్టెంబర్ 29న మాలేగావ్లోని భికు చౌక్ ప్రాంతంలో చోటు చేసుకుంది.ద్విచక్ర వాహనంలో అమర్చిన IED బాంబు పేలడంతో ఆరుగురు వ్యక్తులు మరణించగా,101 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొదట మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక విభాగం (ఏటీఎస్)ఈ ఘటనను దర్యాప్తు చేయగా, 2011లో ఈ కేసు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదలాయించబడింది. పేలుడు జరిగిన మోటార్ సైకిల్ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పేరుతో రిజిస్టర్ అయ్యిందని ప్రాసిక్యూషన్ వాదించింది. ఎన్ఐఏ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవినాష్ రసల్ కోర్టుకు పలు ఆధారాలు,కాల్ డేటా రికార్డులు,నిందితుల మధ్య జరిగిన ఫోన్ కాల్స్,స్వాధీనం చేసుకున్న వస్తువులను సమర్పించారు.
వివరాలు
ఎలక్ట్రానిక్ కాల్ రికార్డులకు సెక్షన్ 65B సర్టిఫికేట్
అంతేకాదు, సుధాకర్ చతుర్వేది నివాసంలో దొరికిన RDX బాంబును కల్నల్ ప్రసాద్ పురోహిత్ ఆదేశాల మేరకు ఉపయోగించారన్నదే ప్రాసిక్యూషన్ ప్రధాన వాదనగా నిలిచింది. దీనికి ప్రత్యుత్తరంగా డిఫెన్స్ న్యాయవాదులు ఈ ఆధారాలను ప్రశ్నించారు. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ తరపున న్యాయవాదులు పేలుడు తర్వాత మోటార్ సైకిల్ ఛాసిస్ పూర్తిగా దెబ్బతిన్నదని, అందువల్ల దాని యాజమాన్యాన్ని నిర్ధారించడం సాధ్యం కాదని వాదించారు. కల్నల్ పురోహిత్ న్యాయవాది విరాల్ బాబర్ తన క్లయింట్ను కావాలనే ఈ కేసులో ఇరికించారని, తీవ్రంగా హింసించి ఒప్పుకునేలా చేశారని కోర్టుకు వాదనలు అందించారు. అదేవిధంగా, ఫోన్ కాల్ రికార్డులపై సెక్షన్ 65B సర్టిఫికెట్ లేకపోవడంతో, అవి చట్టపరంగా తిరస్కరణీయమని తెలిపారు.
వివరాలు
యూ.ఏ.పి.ఏ,ఐపీసీ,పేలుడు పదార్థాల చట్టాల కింద విచారణ
ఈ కేసు విచారణ అధికారికంగా 2018 డిసెంబరులో ప్రారంభమైంది. మొత్తం 323 మంది సాక్షులను విచారించగా,వారిలో 39 మంది తమ వాంగ్మూలాలను మార్చారు. మరోవైపు, 26 మంది సాక్షులు విచారణ ప్రారంభమయ్యేలోపు మరణించారు. ఎన్ఐఏ, మకోకా (MCOCA) నిబంధనలను తర్వాత తొలగించినప్పటికీ, యూ.ఏ.పి.ఏ (UAPA), ఐపీసీ (IPC),పేలుడు పదార్థాల చట్టాల కింద విచారణ కొనసాగింది. తుదకు ఈ ఏడాది ఏప్రిల్ 19న కోర్టు తీర్పును రిజర్వ్ చేయగా, నేడు దానిని వెల్లడించనుంది. ఇక, దేశవ్యాప్తంగా ఈ కేసు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, ప్రసాద్ పురోహిత్ సహా ఇతర నిందితుల భవితవ్యం ఈ తీర్పుపైనే ఆధారపడి ఉంది.