Opposition Meeting: 26 ప్రతిపక్షాల కూటమి పేరు 'I-N-D-I-A' గా ఖరారు
బెంగళూరులో సమావేశమైన 26 ప్రతిపక్ష పార్టీలు తమ కూటమికి పేరును ఖరారు చేశాయి. ప్రతిపక్షాల కూటమికి ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ (I-N-D-I-A)గా నిర్ణయించినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం ప్రకటించారు. 2024 ఎన్నికల కోసం దిల్లీలో 'ఇండియా' ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీల తదుపరి సమావేశం ముంబైలో జరుగుతుందని ఖర్గే చెప్పారు. 11 మంది సభ్యులతో సమన్వయ కమిటీని కూడా ప్రకటించారు. అయితే సభ్యుల పేర్లను ముంబై జరిగే సమావేశంలో చర్చించనున్నారు. 'I-N-D-I-A' రాహుల్ గాంధీ సూచించినట్లు మల్లికార్జున ఖర్గే చెప్పారు. మెజార్టీ పార్టీలు దీన్ని అంగీకరించినట్లు వెల్లడించారు.
ఇది రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం: రాహుల్ గాంధీ
38 ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో బీజేపీ నిర్వహిస్తున్న సమావేశంపై కూడా ఖర్గే స్పందించారు. భారతదేశంలో ఆ పార్టీల గురించి తాము వినలేదని ఎద్దేవా చేశారు. ఇంతకు ముందు వారు ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదన్నారు. ప్రతిపక్ష పార్టీలకు భయపడి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు తాము బెంగళూరులో సమావేశమైనట్లు ఖర్గే చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్గాంధీ ప్రతిపక్షాల సమావేశం గురించి మాట్లాడారు. ఈ సమావేశం ఫలప్రదంగా సాగిందన్నారు. బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. ఈ పోరాటం బీజేపీ- ప్రతిపక్షాల మధ్య కాదని, రెండు సిద్ధాంతాల మధ్య అని రాహుల్ చెప్పుకొచ్చారు. అందుకే తామ పోరాటానికి 'ఇండియా' అని పేరు పెట్టుకున్నట్లు చెప్పారు.