Mahanadu: మహానాడులో పసందైన వంటకాలు.. మూడు రోజులు 30 రకాల వంటకాలతో విందు
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగుదేశం పార్టీ మహానాడు ఎక్కడ నిర్వహించినా, అక్కడ ఆహార పరంగా ప్రత్యేక ఆకర్షణ ఉంటుందనడం అతిశయోక్తి కాదు.
పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి తారక రామారావు స్వయంగా భోజన ప్రియుడిగా ప్రసిద్ధి పొందడంతో, మహానాడు కార్యక్రమాలకు హాజరయ్యే ప్రతినిధులు, అతిథులకు విందు ఇచ్చే సాంప్రదాయం అప్పటినుంచి కొనసాగుతోంది.
ప్రస్తుతం కడపలో జరుగుతున్న మూడు రోజుల మహానాడులో కూడా అదే సంప్రదాయానికి కొనసాగింపుగా రుచికరమైన వంటకాలను సిద్ధం చేస్తున్నారు.
ఈసారి చాలా కాలం తర్వాత మాంసాహారాన్ని కూడా మెనూలో చేర్చారు.
వివరాలు
ప్రతి రోజు 30కు పైగా వంటకాలు
మహానాడు నిర్వహించే ప్రాంతంతో సంబంధం లేకుండా, అందులో ఆహార ఏర్పాట్లపై తీసుకునే శ్రద్ధే అసలైన విశేషం.
ఈసారి కడప వేదికగా నిర్వహిస్తున్న మహానాడులో ఆంధ్రరుచులను ప్రతిబింబించేలా పలు ప్రసిద్ధ స్వీట్స్.. ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజా, బందరు లడ్డూ లాంటి సంప్రదాయ మిఠాయిలతోపాటు, పప్పు, దప్పళం, ఉలవచారు, పాల తాలికలు, చక్కెర పొంగలి వంటి వంటలు వడ్డిస్తున్నారు.
ఇవి కాకుండా, ఆధునిక రుచులకూ ప్రాధాన్యత ఇస్తూ, ఆపిల్ హల్వా, వెజ్ జైపూరి, కడాయి వెజ్ కుర్మా వంటి వంటకాలు కూడా మెనూలో చేర్చారు.
ప్రతిరోజూ సుమారు 30 రకాల భోజనాలు అతిథులకు అందించనున్నారు .
వివరాలు
ప్రత్యేక వంటకాలు.. 2000 మంది పాకశాస్త్ర నిపుణులు
రెండు తెలుగు రాష్ట్రాలనుండి వేలాది మంది ప్రతినిధులు హాజరవుతుండడంతో, ఆహార ఏర్పాట్లను టీడీపీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రసిద్ధమైన వంటకాలు, మిఠాయిలు ప్రత్యేకంగా వడ్డించనున్నారు.
ఈ మహా విందును సిద్ధం చేయడానికి దాదాపు 2000 మంది వంటనిపుణులు నిష్టతో పనిచేస్తున్నారు.
మే 28న ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని, ఆయనకు అత్యంత ఇష్టమైన పాల తాలికలు, బాదం బర్ఫీ, బొబ్బట్లు, చక్కెర పొంగలి వండనున్నట్లు సమాచారం.
వివరాలు
మాంసాహార ప్రియులకు ప్రత్యేక ఆకర్షణ
భోజన ఏర్పాట్ల కమిటీకి చెందిన ఓ సభ్యుడు తెలిపిన వివరాల ప్రకారం.. "2014 నుంచి మహానాడు కోసం మేమే భోజన ఏర్పాట్లు చేస్తూ వస్తున్నాం. ఈసారి కడప మహానాడులో పాల్గొనడానికి మేము 10 రోజుల ముందే 2000 మంది సిబ్బందితో వచ్చాం. వారి సహకారంతో టిఫిన్లు,భోజనాలు,ఇతర ఏర్పాట్లను నిర్వహిస్తున్నాం.ఈ రెండు రోజులలో తాపేశ్వరం కాజా,అల్లూరయ్య మైసూరుపాకం,చక్కెర పొంగలి, హల్వా వంటి స్వీట్లతో పాటు రాయలసీమ వాసులకోసం మాంసాహార విభాగంలో గోంగూర చికెన్ బిర్యానీ, దోసకాయ మటన్, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ, ఎగ్ ఫ్రై వంటివి అందిస్తున్నాం. వెజిటేరియన్ వంటకాలు కూడా సమృద్ధిగా ఉండేలా చూస్తున్నాం. ఈ మూడు రోజుల మహానాడు విజయవంతంగా జరగడం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి" అని తెలిపారు.
వివరాలు
భారీ ఏర్పాట్లు.. ప్రత్యేక షెడ్లు
భోజనాల కోసం ప్రత్యేకంగా ఐదు భారీ హ్యాంగర్లను ఏర్పాటు చేశారు. వాటిలో రెండు హ్యాంగర్లు పూర్తిగా నాయకులు, కార్యకర్తల కోసం కేటాయించారు.
ఒక్కో హ్యాంగర్లో ఒకేసారి 3500 మంది భోజనం చేయగలరు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల కోసం ఒక ప్రత్యేక హ్యాంగర్ ఉండగా, జీవితకాల సభ్యత్వం ఉన్నవారు, ఇతర ప్రముఖుల కోసం మరో హ్యాంగర్ ఏర్పాటు చేశారు.
ప్రతిరోజూ సుమారు 30,000 మందికి భోజనం అందించేలా ఏర్పాట్లు చేశారు. అవసరమైతే అదనంగా మరో 10,000 మందికి భోజనం అందించే సామర్థ్యం కూడా సిద్ధంగా ఉంది.
వివరాలు
ముగింపు సభకు లక్షలాది మందికి విందు
మహానాడు ముగింపు రోజున నిర్వహించనున్న భారీ బహిరంగ సభ సందర్భంగా దాదాపు 3 లక్షల మందికి విందు ఏర్పాటు చేశారు.
ఈ ఏర్పాట్లలో భాగంగా కడప-చిత్తూరు మార్గంలో 75,000 మందికి, పులివెందుల వైపు 35,000 మందికి, రాజంపేట వైపు 30,000 మందికి, నంద్యాల వైపు 50,000 మందికి భోజన సదుపాయాలు సిద్ధం చేశారు.