
Kailash Manasarovar Yatra: ఐదు సంవత్సరాల విరామం అనంతరం.. 720 మందితో మళ్లీ ప్రారంభం కానున్న కైలాస మానస సరోవర యాత్ర
ఈ వార్తాకథనం ఏంటి
ఐదేళ్ల విరామం తర్వాత కైలాస మానస సరోవర యాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. ఈసారి మొత్తం 720 మంది భక్తులు ఈ పుణ్యయాత్రలో పాల్గొననున్నారు.
వీరితో పాటు 30 మంది లైజన్ అధికారులు కూడా ఉండనున్నారని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది.
యాత్రికుల ఎంపికకు లక్కీ డ్రా విధానాన్ని అనుసరించారు. కంప్యూటర్ ద్వారా ర్యాండమ్గా వ్యక్తులను ఎంపిక చేశారు.
కరోనా మహమ్మారి కారణంగా 2020 నుంచి మానస సరోవర యాత్రను నిలిపివేసిన సంగతి తెలిసిందే.
చైనా ప్రభుత్వం నుంచి యాత్రకు సంబంధించి సరైన సమాచారం లేకపోవడం కూడా ఆ నిర్ణయానికి కారణమైంది.
జూన్ మూడవ వారం నుండి యాత్ర మొదలయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 25వ తేదీతో ఈ యాత్ర ముగియనుంది.
వివరాలు
ఉత్తరాఖండ్ మార్గం ద్వారా ఐదు బ్యాచ్లు
ఈ యాత్ర రెండు ప్రధాన మార్గాల్లో నిర్వహించనున్నారు. ఉత్తరాఖండ్, సిక్కిం రూట్లలో.
ఈ రెండు మార్గాల కలిపి మొత్తంగా 720 మందికి మాత్రమే ఈసారి అవకాశం కల్పించారు.
టిబెట్ ప్రాంతంలో ఉన్న కైలాస పర్వతం,మానస సరోవరానికి భక్తులు చేరుకోనున్న ఈ యాత్ర లో ఉత్తరాఖండ్ మార్గం ద్వారా ఐదు బ్యాచ్లను పంపనున్నారు.
ప్రతి బ్యాచ్లో 48 మంది భక్తులు ఉండనున్నారు.అదే విధంగా, సిక్కిం మార్గంలో నాథులా పాస్ ద్వార 10 బ్యాచ్లు బయలుదేరనున్నాయి.
వివరాలు
మొత్తం 5384 మంది దరఖాస్తు
ఒక్కొక్క బ్యాచ్లో 48 మంది యాత్రికులు ఉంటారు. ఈ యాత్ర కోసం ఈసారి మొత్తం 5384 మంది దరఖాస్తు చేశారు.
వీరిలో 3898 మంది పురుషులు కాగా, 1486 మంది మహిళలు ఉన్నారు. అలాగే 65 ఏళ్లు పైబడిన వయోజనులు 404 మంది ఉన్నట్లు సమాచారం.
హిందువులతో పాటు బౌద్ధులు, జైనులు కూడా ఈ యాత్రను అత్యంత పవిత్రంగా భావిస్తారని విదేశాంగ శాఖ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలియజేశారు.
లిపులేక్ పాస్, నాథులా పాస్ మార్గాల్లో రోడ్లను నిర్మించిన కారణంగా, వృద్ధ యాత్రికులకు ఈసారి ప్రయాణం మరింత సులభమవుతుందని ఆయన వివరించారు.