Page Loader
Manish Sisodia: రావణాసురుడి వారసులు స్పదించారు.. ఆప్‌,బీజేపీల మధ్య మాటల యుద్ధం
రావణాసురుడి వారసులు స్పదించారు.. ఆప్‌, భాజపాల మధ్య మాటల యుద్ధం

Manish Sisodia: రావణాసురుడి వారసులు స్పదించారు.. ఆప్‌,బీజేపీల మధ్య మాటల యుద్ధం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2025
02:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ వాతావరణం ఉత్కంఠగా మారింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రధాన విపక్షమైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ ) మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో ఆప్ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రామాయణంలోని మాయలేడి ఉదాహరణతో కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సత్వరంగా స్పందించారు. దీనిపై ఆప్‌ సీనియర్‌ నేత మనీశ్‌ సిసోదియా తన సోషల్ మీడియా వేదికగా ఎద్దేవా చేశారు.

వివరాలు 

బీజేపీపై కేజ్రీవాల్‌ తీవ్ర ఆరోపణలు

"నిన్న కేజ్రీవాల్‌ రావణుడికి సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. రావణుడి వారసులు (బీజేపీ నేతలు) వెంటనే స్పందించారు. దిల్లీ ప్రజలు వారి అసలు ఉద్దేశాన్ని గ్రహించాలి. వారు దిల్లీ ప్రజలకు రావణుడి కంటే పెద్ద ముప్పుగా మారతారు. జాగ్రత్తగా ఉండండి. వారి లక్ష్యం అధికారాన్ని చేజిక్కించుకోవడం, భూములను ఆక్రమించడం మాత్రమే" అని సిసోదియా రాసుకొచ్చారు. సోమవారం విశ్వాస్ నగర్‌లోని మురికివాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్‌ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. "ఎన్నికల తర్వాత బీజేపీ మురికివాడ ప్రజల భూములను అమ్మేస్తుంది. రామాయణంలోని మాయలేడిని గుర్తుంచుకోండి. బీజేపీ నేతల మోసపూరిత ఉచ్చులో చిక్కుకోకండి" అంటూ ఓటర్లను హెచ్చరించారు.

వివరాలు 

 ఖండించిన బీజేపీ 

కేజ్రీవాల్‌ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. "కేజ్రీవాల్‌ సనాతన ధర్మాన్ని అవమానించారు. రామచరితమానస్‌ను తారుమారు అర్థం చేసుకున్నారు" అని దిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ విమర్శించారు. దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరుగుతాయి. ఫలితాలు ఫిబ్రవరి 8న వెలువడనున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీల నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.