
Andhra News: రాష్ట్రప్రభుత్వ సహకారంతో ఏపీలో 25 జిల్లాల్లో క్రికెట్ మైదానాలు: ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లోని 25 జిల్లాల్లో క్రికెట్ మైదానాల నిర్మాణానికి ప్రయత్నిస్తున్నామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు.
ఆదివారం విజయవాడలో నిర్వహించిన ఏసీఏ 72వ వార్షిక సర్వసభ్య సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాబోయే రెండు సంవత్సరాల్లో ఏసీఏకి స్వంత మైదానాల ఏర్పాటు లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలుగులోకి తీసుకురావడం కోసం ఆంధ్రప్రదేశ్ లీగ్ (ఏపీఎల్) టోర్నీని నిర్వహించనున్నట్లు చెప్పారు.
వివరాలు
200రోజుల పాటు మ్యాచ్లు నిర్వహించేలా ప్రణాళిక
విశాఖపట్టణంలోని స్టేడియాన్ని మరింత అభివృద్ధి చేసి,అక్కడ ఎక్కువ మ్యాచ్లు నిర్వహించేలా, అలాగే మరిన్ని ఫ్రాంఛైజీలు రావాలనే దిశగా చురుకైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఏసీఏ అనుబంధంగా ఉన్నక్రికెట్ క్లబ్లు కూడా టోర్నమెంట్లు నిర్వహించాలని కోరగా,సభ్యులు ఆ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించారని వివరించారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లా క్రికెట్ సంఘాలు సంవత్సరానికి కనీసం 200రోజుల పాటు మ్యాచ్లు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు.
రాష్ట్ర రాజధాని ప్రాంతంలో నిర్మించనున్న క్రీడా నగరంలో ఒక అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం కూడా నిర్మించబోతున్నట్లు చెప్పారు.
ఈ విషయంపై ఏసీఏ కార్యదర్శి సానా సతీష్,రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సహకారంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్ జై షా,బీసీసీఐతో ప్రాథమిక స్థాయిలో చర్చలు నిర్వహించామని తెలిపారు.
వివరాలు
మహిళల వరల్డ్కప్ క్రికెట్ పోటీలకు వేదిక
రాష్ట్రం తొలిసారిగా మహిళల వరల్డ్కప్ క్రికెట్ పోటీలకు వేదిక కావడం గర్వకారణమని ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ పేర్కొన్నారు.
సెప్టెంబరు,అక్టోబర్ నెలల్లో విశాఖలో ఈ పోటీలు జరగనున్నట్లు తెలిపారు.
జిల్లా క్రికెట్ సంఘాలకు సంవత్సరానికి ఇచ్చే నిధులను రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచినట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో ఏసీఏ ఉపాధ్యక్షుడు పి.వెంకట రమాప్రశాంత్, కోశాధికారి దండమూడి శ్రీనివాసరావు, కౌన్సిలర్ దంతు విష్ణుతేజ్, పురుషుల ప్రతినిధి ప్రసన్నకుమార్, మహిళా ప్రతినిధి ఎన్.గీత, మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.