
Air India: విమానంలో ఉన్న 242 మంది మృతి.. అధికారికంగా ప్రకటించిన గుజరాత్ ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా మొత్తం 242 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ విషయాన్ని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
మృతుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, 7 మంది పోర్చుగల్ వాసులు, ఒక కెనడియన్ పౌరుడు ఉన్నారు.
ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని గుజరాత్ రాష్ట్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ధనుంజయ ద్వివేది తెలిపారు.
వివరాలు
ఐదుగురు మెడికల్ విద్యార్థులు మృతి
మృతదేహాల గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆయన వివరించారు.
డీఎన్ఏ నమూనాల కోసం మృతుల బంధువులు శాంపిళ్లు ఇవ్వాలని కోరుతూ, టెస్టుల అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగిస్తామని వెల్లడించారు.
విమాన ప్రమాదం మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాన్ని కూడా ప్రభావితం చేసింది.
ఈ భవనంలోని ఐదుగురు మెడికల్ విద్యార్థులు ప్రమాదంలో దుర్మరణం చెందారు.
విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే 825 అడుగుల ఎత్తు వరకు వెళ్లి, ఆ తర్వాత అట్టడుగున పడిపోయింది.
మొదట జూనియర్ డాక్టర్ల హాస్టల్పై, ఆపై సీనియర్ రెసిడెంట్ హాస్టల్పైకి దూసుకెళ్లింది.
ప్రమాద సమయంలో విద్యార్థులు మెస్లో భోజనం చేస్తుండటంతో కొంతమంది గాయపడ్డారు.
వివరాలు
ప్రమాదానికి కారణమేమిటి..
ఈ ప్రమాదానికి కారణమేమిటన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
అయితే, విమానాన్ని ఏదైనా పక్షి ఢీకొట్టిన కారణంగా కూడా ఇది జరగవచ్చని విమానయాన నిపుణులు భావిస్తున్నారు.
ఈ విమానం లండన్కు బయలుదేరగా, అందులో 232 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారు.
విమానం కూలిన ప్రదేశం వద్ద పరిశీలించినప్పుడు, అది హాస్టల్ డైనింగ్ హాల్ గోడను ఢీకొట్టి వెళ్లినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది.
దానితోపాటు విద్యార్థుల ప్లేట్లలో భోజనం అలాగే ఉండటం గమనించదగిన విషయం.
వివరాలు
పైలట్ సమీర్ సబర్వాల్ కు 8,200 గంటల ఫ్లయింగ్ అనుభవం
ఒక వీడియోలో విమానం తక్కువ ఎత్తులో ఉన్నపుడే భూమిని ఢీకొని,ఆపై భారీ శబ్దంతో పేలిపోయిన దృశ్యాలు కనిపించాయి.
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ "Mayday" సంకేతాన్ని పంపించినట్టు సమాచారం.
అనంతరం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ విమానంలోని వారిచే స్పందన రాలేదని నివేదికలు పేర్కొన్నాయి.
ఈ విమానాన్ని పైలట్ సమీర్ సబర్వాల్ నడుపుతున్నారు.ఆయనకు 8,200 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉంది.
ఫస్ట్ ఆఫీసర్ క్లీవ్ కుందార్కు 1,100 గంటల విమాన సేవ అనుభవం ఉన్నట్టు DGCA పేర్కొంది.
కూలే ముందు వారు "మేడే" కాల్ చేసినట్టు వివరించారు. విమానం మిగిలిన భాగాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.
వివరాలు
ఎయిర్ ఇండియా బాధితుల కోసం ప్రత్యేకంగా హాట్లైన్ నంబర్
చుట్టుపక్కల దట్టమైన పొగ వ్యాపించింది. ప్రమాదం జరిగిన వెంటనే ఎమర్జెన్సీ సిబ్బంది గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ప్రమాద స్థలానికి కనీసం 24 అంబులెన్సులు వచ్చాయని, గాయపడిన వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లేందుకు పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసినట్టు సమాచారం.
పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఈ ప్రమాద స్థితిని తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు.
అన్ని విమానయాన, అత్యవసర స్పందనా సంస్థలు సమన్వయంతో వెంటనే స్పందించాలని ఆయన ఆదేశించారు.
ఎయిర్ ఇండియా బాధితుల కోసం ప్రత్యేకంగా హాట్లైన్ నంబర్ 1800 5691 444ను ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు.