
AP Rains: ఏపీలో రాబోయే 5 రోజులు భారీ వర్షాలు.. 23న బంగాళాఖాతంలో అల్పపీడనం
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతాల్లో,ఉత్తర కోస్తా,దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరగా ఆదివారం నాడు ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం నాటికి ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. పిడుగులు పడే అవకాశముండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సోమవారం నాడు విశాఖపట్నం,అనకాపల్లి,కాకినాడ, డాక్టర్ బీఆర్.అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు.
వివరాలు
శ్రీకాకుళం జిల్లా మందసలో అత్యధికంగా 81 మిల్లీమీటర్ల వర్షపాతం
ఆదివారం నాడు శ్రీకాకుళం, ప్రకాశం, విజయనగరం, గుంటూరు, పల్నాడు, శ్రీ సత్యసాయి, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు కురిశాయి. రాత్రి 7 గంటల వరకు లభించిన సమాచారం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా మందసలో అత్యధికంగా 81 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అదే జిల్లాలోని పైడిభీమవరంలో 79 మిల్లీమీటర్లు, ప్రకాశం జిల్లా టంగుటూరులో 77 మిల్లీమీటర్లు, విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 77 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు.