Page Loader
Tourism Conclave Tech AI 2.0: ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక గమ్యంగా మార్చడమే ప్రభుత్వం లక్ష్యం..!

Tourism Conclave Tech AI 2.0: ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక గమ్యంగా మార్చడమే ప్రభుత్వం లక్ష్యం..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 27, 2025
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా బడ్జెట్ కేటాయింపులు, విధాన రూపకల్పన, అమలులో వేగాన్ని పెంచుతోంది. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ టూరిజం (GFST), ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTDC) సంయుక్తంగా నిర్వహిస్తున్న "టూరిజం కాన్‌క్లేవ్ టెక్ AI 2.0" రెండవ రోజు సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్యంగా పాల్గొని తన అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యాటక విధానాలను సమర్థవంతంగా అమలు చేయాలంటే మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం, ప్రాజెక్టుల అమలు వేగవంతం చేయడం, స్థానిక ప్రమేయాన్ని పెంపొందించడంలో పెట్టుబడిదారుల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు.

వివరాలు 

రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం 

2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కాన్‌క్లేవ్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పించగా,మొత్తం రూ.10,039 కోట్ల విలువైన ఒప్పందాల కోసం టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సిద్ధమవుతోంది. ముఖ్యంగా విశాఖపట్టణం,అమరావతి, తిరుపతి వంటి కీలక నగరాల్లో పర్యాటక హోటళ్ల నిర్మాణం కోసం ఒప్పందాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ సమావేశంలో పాల్గొన్న పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ.. జూలై 2వ తేదీన విశాఖపట్నం నుంచి చెన్నై వరకు కార్డీలియా క్రూయిజ్ సర్వీసులు మళ్లీ ప్రారంభం కానున్నట్లు చెప్పారు.

వివరాలు 

చెన్నై - విశాఖ మధ్య క్రూయిజ్ సేవలు 

పుదుచ్చేరి మీదుగా నడిచే ఈ క్రూయిజ్ సేవలను సీఎం చంద్రబాబు విజయవాడ నుంచే వర్చువల్ రూపంలో ప్రారంభించనున్నారు. గతంలో ఇదే సంస్థ చెన్నై - విశాఖ మధ్య క్రూయిజ్ సేవలను నిర్వహించినట్లు తెలిపారు. ఇక కడప జిల్లాలోని కాశీనాయన జ్యోతి క్షేత్రానికి సంబంధించిన బస్సు సేవలపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. అటవీ శాఖ ఆంక్షల కారణంగా నిలిపివేసిన ఆర్టీసీ బస్సులను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నామని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటూ, అటవీశాఖతో సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కరించినట్లు వెల్లడించారు. నేటి నుంచే ఆ బస్సు సర్వీసులు మళ్లీ ప్రారంభమవుతున్నాయని తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 "టూరిజం కాన్‌క్లేవ్ టెక్ AI 2.0" రెండవ రోజు సమావేశం