నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక భేటీ.. ఉద్యోగుల్లో టెన్షన్ టెన్షన్
ఏపీలో కీలక మంత్రివర్గం సమావేశం జరగనుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో జరగనున్న ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పలు ముఖ్య నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఈ మేరకు ఉద్యోగ సంఘాల్లో టెన్షన్ నెలకొంది. సీపీఎస్ స్థానంలో నూతన విధానానికి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలపడం సూత్రప్రాయమే అని తెలుస్తోంది. పాత పింఛన్ పథకానికి సమానంగా ఉండే మరో కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు సమాచారం. సర్కార్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత వచ్చే పింఛన్ 50 శాతానికి తగ్గకుండా చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు డీఏ సైతం క్రమంగా పెరిగేలా నిర్ణయం చేయనున్నారని తెలుస్తోంది.
నేటి మంత్రివర్గ భేటీలో పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం
కేబినెట్ ముఖ్యనిర్ణయాలు : 1. గృహ నిర్మాణ ప్రాజెక్టులను పరుగులు పెట్టించడం 2. ఏపీ ఆర్థిక పరిస్థితి, పునర్విభజన చట్టం కింద పెండింగ్ సమస్యల పరిష్కరణ 3. రెవెన్యూ లోటుతో పాటు పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధుల మంజూరీ 4. డ్యామ్ నిర్మాణ పురోగతి 5. ఉద్యోగులకు సీపీఎస్ స్థానంలో మరో పథకం లాంటి కీలక అంశాలను మంత్రి వర్గ సమావేశంలో కొలిక్కి వచ్చే ఆస్కారం ఉంది. ఈ మేరకు ప్రతిపాదనలను అందజేయాలంటూ గతంలోనే సీఎస్ జవహర్రెడ్డి ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రిమండలి భేటీ అనంతరం సీఎం వైఎస్ జగన్, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహానికి హాజరుకానున్నట్లు సమాచారం.