Vijayasai Reddy: విజయసాయిరెడ్డికి బిగ్ షాక్..ఏపీ సీఐడీ నోటీసులు
ఈ వార్తాకథనం ఏంటి
వై.ఎస్.జగన్ పాలనలో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ (కేఎస్పీఎల్), కాకినాడ సెజ్ (కేసెజ్)లో రూ.3,600 కోట్ల విలువైన వాటాలను వాటి యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) నుంచి బలవంతంగా స్వాధీనం చేసుకున్న కేసులో వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది.
బుధవారం ఉదయం విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
ఇద్దిరోజుల క్రితం సీఐడీ అధికారులు విజయసాయిరెడ్డి నివాసానికి వెళ్లినప్పటికీ, అతను అందుబాటులో లేకపోవడంతో ఆయన సతీమణికి నోటీసులను అందజేశారు.
ఈ కేసులో విజయసాయిరెడ్డి రెండో నిందితుడు (A2)గా ఉన్నారు, అలాగే జగన్ బాబాయ్ వై.వి.సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్రెడ్డి ప్రధాన నిందితుడు (A1)గా ఉన్నారు.
వివరాలు
రెండు నెలల క్రితం ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి
కేఎస్పీఎల్, కేసెజ్ వాటాల స్వాధీనానికి సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందని గుర్తించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED), మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపి కేసు నమోదు చేసింది.
రెండు నెలల క్రితం ఈడీ విజయసాయిరెడ్డిని విచారణకు పిలిచింది. ఇప్పుడు అదే వ్యవహారంలో సీఐడీ కూడా విచారణ ప్రారంభించింది.