LOADING...
Raghuveer Reddy: రిటైర్డ్ ఐపీఎస్‌ రఘువీర్‌రెడ్డిపై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
రిటైర్డ్ ఐపీఎస్‌ రఘువీర్‌రెడ్డిపై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

Raghuveer Reddy: రిటైర్డ్ ఐపీఎస్‌ రఘువీర్‌రెడ్డిపై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 07, 2025
05:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

విశ్రాంత ఐపీఎస్ అధికారి రఘువీర్ రెడ్డి మీద వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణాధికారిని నియమించింది. ఈ మేరకు ఇంటెలిజెన్స్ ఐజీ రామకృష్ణను విచారణాధికారిగా, అనంతపురం డీఐజీ షిమునిని ప్రజెంటింగ్ ఆఫీసర్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారిక ఆదేశాలను జారీ చేశారు. రఘువీర్ రెడ్డిపై నమోదైన ఆరోపణల నేపథ్యంలో సదరు విచారణ అధికారుల నుండి నివేదికను పొందాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో రఘువీర్ రెడ్డి నంద్యాల జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించారు. ఆ సమయంలో ఎన్నికల ప్రచారం సాగుతున్న వేళ, నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డిని ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ కలిశారు.

వివరాలు 

నంద్యాలలో అల్లు అర్జున్‌ పర్యటన, భారీ ర్యాలీకి అనుమతి

ఎన్నికల ప్రచారం వేళ అమలులో ఉన్న సమయంలో అల్లు అర్జున్ నంద్యాలలో పర్యటించి భారీ ర్యాలీకి అనుమతి ఇచ్చారని రఘువీర్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. అదే రోజున అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాలలో పర్యటించనుండగా, అదే సమయానికి వైఎస్సార్సీపీ ర్యాలీకి అనుమతి ఇచ్చారని రఘువీర్ రెడ్డిపై ఆరోపణలు నమోదయ్యాయి. దీని వల్ల శాంతి భద్రతలకు ఆటంకం కలగచ్చని అప్పుడు ఎన్నికల అధికారులు అభిప్రాయపడుతూ కేసును కూడా నమోదు చేశారు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరించి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన్ను గూర్చి వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి తగిన నివేదికను అందించాలని ప్రభుత్వం తాజా ఆదేశాలలో పేర్కొంది.