'అధికార దాహంతో దేశానికి చాలా హాని చేశారు'; కాంగ్రెస్పై విరుచుకపడ్డ మోదీ
పేరు ప్రతిష్ఠలు, ఎప్పటికీ దేశాన్ని తామే పాలించాలన్న అధికార దాహంతో కొందరు ప్రజలకు హానీ చేశారని ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్పై విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాత్రం అధికార దాహంతో కాకుండా దేశంతో పాటు ప్రజలకు సేవ చేసే దృక్పథంతో పనిచేస్తోందన్నారు. అసోంలోని గువాహటిలో శుక్రవారం జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి పీఎం మోదీ మాట్లాడారు. ప్రధానంగా కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. గత తొమ్మిదేళ్లుగా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి గురించి తాను మాట్లాడినప్పుడల్లా కొంతమందికి ఇబ్బంది కలుగుతుందని పరోక్ష విమర్శలు చేశారు.
ప్రజలకు సేవకులుగా పని చేస్తున్నాం: మోదీ
వారు(కాంగ్రెస్) కూడా దశాబ్దాలు దేశాన్ని పరిపాలించారన్నారు. అధికార కాంక్ష, ప్రతిష్ట కోసం దేశంపై ప్రభువుగా ఉండాలనే ఏకైక ఆశయంతో ప్రజలను వంచించారని మోదీ మండిప్డడారు. అసోం ప్రజలతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేసుకున్నారు. తాము ప్రజల సేవకులుగా ఉండాలనే స్ఫూర్తితో పని చేస్తున్నామన్నారు. బీజేపీ హయాంలో ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని స్పష్టం చేశారు. ఈశాన్యంలో మొదటి ఎయిమ్స్ వచ్చిందని, అస్సాంలో మూడు కొత్త మెడికల్ కాలేజీలను తాము ఏర్పాటు చేసినట్లు గుర్తు చేసారు. గత తొమ్మిదేళ్లలో బీజేపీ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించినట్లు చెప్పారు. నిర్దిష్ట ఓటు బ్యాంకు కోసం బదులు, దేశంలోని ప్రజల కష్టాలను తగ్గించడంపై తాము దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు.