
Bapatla: డయాబెటిక్ స్మార్ట్ రైస్ కుక్కర్.. బాపట్ల పోస్ట్ హార్వెస్ట్ సెంటర్లో కొత్త ఆవిష్కరణలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో బాపట్లలోని కోత అనంతర పరిజ్ఞాన కేంద్రం మూడు వినూత్న ఆవిష్కరణలను రూపొందించింది.
ఇవి డయాబెటిక్ స్మార్ట్ రైస్ కుక్కర్, గ్లైసెమిక్ ఇండెక్స్ పరీక్ష కిట్, ఎండుమిర్చిని గోతాల్లో నింపే యంత్రం.
ఈ పరికరాలు వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా, పరీక్షల వ్యయం తగ్గించడంలోను, శారీరక శ్రమను తగ్గించి మెషినరీ ఆధారంగా పని చేయడంలోను ఉపయోగపడతాయి.
ఈ మూడు ఆవిష్కరణలకు ఇప్పటికే పేటెంట్ హక్కులు లభించాయి.
వివరాలు
తిన్నది నిదానంగా అరిగేలా.. డయాబెటిక్ స్మార్ట్ కుక్కర్
మన శరీరంలో ఆహారం పిండిపదార్థాలుగా జీర్ణమై, రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది.
ఈ ప్రభావాన్ని కొలిచే ప్రమాణమే గ్లైసెమిక్ ఇండెక్స్ (GI). GI విలువ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతాయి.
తెల్లబియ్యం GI విలువ ఎక్కువగా కలిగి ఉంటుంది. అయితే, బాపట్లలో రూపొందించిన స్మార్ట్ రైస్ కుక్కర్ బియ్యాన్ని ప్రత్యేక విధానంలో ఉడికించి GI విలువను తగ్గిస్తుంది.
ఈ పరికరం డయాబెటిస్ ఉన్నవారికే కాకుండా, శరీర బరువు నియంత్రణకు,జీవక్రియ రేటును సమతుల్యంగా ఉంచుకోవాలనుకునే వారికీ ఉపయోగపడుతుంది. అందరికి ఉపయోగకరంగా ఉండేలా దీన్ని రూపొందించారు.
వివరాలు
తిన్నది నిదానంగా అరిగేలా.. డయాబెటిక్ స్మార్ట్ కుక్కర్
ఈ కుక్కర్ ప్రత్యేకత ఏమిటంటే, ప్రాసెసింగ్ ట్రీట్మెంట్ ద్వారా అన్నంలో GI విలువను తగ్గించి, నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
దీనివల్ల అన్నం తిన్న తర్వాత చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరగకుండా నియంత్రిత స్థాయిలో ఉంటుంది.
పైగా,ఇది శరీర బరువును నియంత్రణలో ఉంచడంలో కూడా దోహదపడుతుంది.
అన్నం వండే సమయంలో అధికంగా నీరు వాడటం వల్ల అదనపు గంజిని వడగట్టడం ద్వారా కార్బోహైడ్రేట్ల పరిమాణాన్ని తగ్గిస్తుంది.
అంతేగాక, ఉడికిన అన్నాన్ని వేగంగా చల్లబరచి 1-2 డిగ్రీల ఉష్ణోగ్రతకు తగ్గిస్తుంది.
వివరాలు
తిన్నది నిదానంగా అరిగేలా.. డయాబెటిక్ స్మార్ట్ కుక్కర్
ఈ కుక్కర్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) ఆధారిత నియంత్రణలతో పాటు, మొబైల్ యాప్ ద్వారా వాడకం సులభంగా ఉంటుంది.
కృత్రిమ మేధ (AI) ఆధారిత అల్గారిథంలతో దీనిని సమగ్రీకరించారు.
దీనివల్ల రైస్ వేరియంట్, గంజి-అన్నం నిష్పత్తి, ఉడికే ఉష్ణోగ్రత, చల్లబరచే స్థాయి, ఆవిరి సమయాలను నియంత్రించవచ్చు.
త్వరలోనే ఈ కుక్కర్ను మార్కెట్లో అందుబాటులోకి తేచే ప్రయత్నం జరుగుతోంది అని శాస్త్రవేత్త డాక్టర్ డి. సందీప్రాజా తెలిపారు.
వివరాలు
గ్లైసెమిక్ ఇండెక్స్ పరీక్ష కిట్ - ఖర్చు తగ్గిస్తూ వినూత్న పరిష్కారం
మనము తీసుకునే ఆహారం శరీరంలో ఎంత త్వరగా జీర్ణమై,చక్కెర స్థాయిని ఎంత మేర పెంచుతుందన్నది గ్లైసెమిక్ ఇండెక్స్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు.
ఇది సాధారణంగా ఖరీదైన ప్రక్రియ.సాధారణంగా ఇన్వైవో విధానంలో.. అంటే వ్యక్తులకు ఆహారం తినిపించి పరిశీలించే పరీక్షకు.. రూ.2.5లక్షల నుంచి రూ.3లక్షల వరకు ఖర్చవుతుంది.
ఈ సమస్యకు పరిష్కారంగా,బాపట్లలోని పరిశోధన కేంద్రం ఇన్విట్రో విధానం(ప్రయోగశాలలో చేసే పరీక్ష) ఆధారంగా GI పరీక్ష కిట్ను రూపొందించింది.
దీని ఖర్చు కేవలం రూ.7,500మాత్రమే అవుతుంది. GI పరీక్ష ఖరీదుగా ఉండటం వల్ల అనేక మంది రైతులు,వినియోగదారులు దీన్ని చేయలేకపోతున్నారు.
GI ఆధారంగా తక్కువ జీర్ణశక్తి కలిగిన ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోవాలనుకునే వారికి ఈ కొత్త కిట్ ఒక వరం లాంటి పరిష్కారంగా నిలవనుంది.
వివరాలు
కాళ్లకు మంట లేకుండా..ఎండుమిర్చి గోతుల్లో నింపే యంత్రం
పంట కోత అనంతరం ఎండుమిర్చిని పొలాల్లో ఆరబెట్టి, ఆ తర్వాత గ్రేడింగ్ చేసి, గోతాల్లోకి తొక్కి మార్కెట్కు తరలించాల్సి వస్తుంది.
ప్రస్తుతం ఈ ప్రక్రియలో కూలీలు కాళ్లతో మిర్చిని తొక్కాల్సి రావడం వల్ల మిర్చి తాకిన చోట మంటలు వస్తూ తీవ్రమైన అసౌకర్యం కలుగుతుంది.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా బాపట్లలోని కోత అనంతర పరిజ్ఞాన కేంద్రం ఎండుమిర్చిని గోతాల్లోకి నింపే యంత్రాన్ని అభివృద్ధి చేసింది.
దీనికి కూడా పేటెంట్ లభించింది.ఈ యంత్రంతో తక్కువ సమయంలో ఎక్కువ మిర్చి టిక్కీలు నింపవచ్చు.
ఇది మిర్చిని దెబ్బతినకుండా, విత్తనాలు జారకుండా నింపుతుంది. ఫలితంగా శ్రమ ఆదా అవుతుంది, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.