
PM Modi: గిరిజన మహిళలను మెచ్చుకున్న ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
''ఒకప్పుడు పొలాల్లో కూలీలుగా శ్రమించిన ఈ మహిళలు, ఇప్పుడు చిరుధాన్యాలతో బిస్కెట్లు తయారు చేస్తూ తమ జీవితాలను మార్చుకుంటున్నారు. వీరి విజయగాధ తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ గర్వపడతారు'' అంటూ భద్రాచలం గిరిజన మహిళలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి (పీఓ) రాహుల్, జిల్లా జాబ్స్ మేనేజర్ హరికృష్ణల సహకారంతో, రాగి, సజ్జ, జొన్న, సామలు వంటి చిరుధాన్యాలను ఉపయోగించి బిస్కెట్లు తయారు చేస్తూ భద్రాద్రి శ్రీరామ స్వయం సహాయక సంఘానికి చెందిన వి. వెంకటలక్ష్మి, తాటి లలిత, సోయం మంగవేణి, జజ్జర సమ్మక్కలు గత ఏడాది నుంచి విజయవంతంగా కొనసాగుతున్నారు. ఈ విషయం ప్రధానమంత్రి మోదీ ఆదివారం ప్రసారం అయిన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రస్తావించారు.
వివరాలు
40 వేల గిరిజన శానిటరీ ప్యాడ్ల తయారీ
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ - ''మన దేశంలోని తల్లులు, అక్కచెల్లెళ్లు, యువతులు సమాజంలో నూతన మార్పులకు దారితీస్తున్నారు. తెలంగాణలోని భద్రాచలం మహిళల విజయకథ అలాంటి మార్గదర్శకమైనదే'' అని కొనియాడారు. ''భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ పేరిట వీరు తయారు చేస్తున్న చిరుధాన్యాల బిస్కెట్లు హైదరాబాద్ నుంచి లండన్ వరకు ఎగుమతి అవుతున్నాయి. స్వయం సహాయక బృందాలతో అనుసంధానమై శిక్షణ పొందిన ఈ మహిళలు మరొక గొప్ప పని చేశారు. కేవలం మూడు నెలల్లోనే 40 వేల గిరిజన శానిటరీ ప్యాడ్లను తయారు చేసి పాఠశాలలు, కార్యాలయాలకు పంపిణీ చేశారు'' అని వివరించారు.