Page Loader
Amit Shah: అమిత్ షా తమిళనాడు పర్యటన.. కొత్త బీజేపీ చీఫ్ పేరు ప్రకటించే ఛాన్స్!
అమిత్ షా తమిళనాడు పర్యటన.. కొత్త బీజేపీ చీఫ్ పేరు ప్రకటించే ఛాన్స్!

Amit Shah: అమిత్ షా తమిళనాడు పర్యటన.. కొత్త బీజేపీ చీఫ్ పేరు ప్రకటించే ఛాన్స్!

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 11, 2025
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొద్దిసేపట్లో తమిళనాడు పర్యటనకు బయలుదేరనున్నారు. త్వరలోనే రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకున్నది. బీజేపీ గెలుపు లక్ష్యంగా వ్యూహాలను సిద్ధం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది. గత నెలలో ఆల్ ఇండియా అన్నాడీఎంకే (AIADMK) ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి (ఈపీఎస్),అమిత్ షా మధ్య కీలక చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో పళనిస్వామి స్పష్టంగా పేర్కొన్న విషయం ఏమిటంటే.. ప్రస్తుత తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలైను తప్పిస్తేనే బీజేపీ-ఎఐఏడీఎంకే మధ్య పొత్తు సాధ్యమవుతుందని. ఈ వ్యాఖ్యల వల్ల రాష్ట్ర బీజేపీలో సంక్షోభం నెలకొంది.

వివరాలు 

ఎస్. గురుమూర్తితో ప్రత్యేక భేటీ

ఈ పరిణామాల మధ్య, ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైయింది. అదే సమయంలో, అమిత్ షా చెన్నైలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో పార్టీ సీనియర్ నాయకులతో అత్యంత ప్రాధాన్యమైన సమావేశం నిర్వహించనున్నారు. ఆ తరువాత ఆర్ఎస్ఎస్ భావజాల నాయకుడు ఎస్. గురుమూర్తితో ప్రత్యేకంగా భేటీ అవుతారు. అనంతరం, ఆయన తమిళనాడులోని రెండు ప్రముఖ దేవాలయాలను దర్శించబోతున్నారు. ఈపర్యటన ముగిసిన తరువాత అమిత్ షా నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశముందని సమాచారం. అయితే, అన్నాడీఎంకేలో అంతర్గత విభేదాల కారణంగా వీకే శశికళను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తరువాత, అలాగే రజనీకాంత్ రాజకీయాలకు దూరమైన నేపథ్యంలో,తమిళనాడు రాజకీయాల్లో పన్నీర్ సెల్వం మళ్లీ ప్రభావవంతమైన పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది.

వివరాలు 

రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పలు పేర్లు 

ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పలు పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నైనార్ నాగేంద్రన్, తమిళిసై సౌందరరాజన్, వానతి శ్రీనివాసన్, కె. అన్నామలై పేర్లు తెగ ప్రచారంలో ఉన్నాయి. ఇక, ఇప్పటికే, తమిళిసై ఒకసారి రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిని నిర్వహించిన అనుభవం కూడా కలదు.