LOADING...
Bihar: బీహార్ ఉప ముఖ్యమంత్రికి పోల్ బాడీ నోటీసులు.. ఎందుకంటే..?
బీహార్ ఉప ముఖ్యమంత్రికి పోల్ బాడీ నోటీసులు.. ఎందుకంటే..?

Bihar: బీహార్ ఉప ముఖ్యమంత్రికి పోల్ బాడీ నోటీసులు.. ఎందుకంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 11, 2025
11:13 am

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణతో మొదలైన రాజకీయ వివాదం,ఇప్పుడు రెండు వేర్వేరు ఓటరు ఐడీ కార్డులు కలిగి ఉండడంపై ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటీసుల దశకు చేరింది. తాజాగా, బీహార్ ఉప ముఖ్యమంత్రి,సీనియర్ బీజేపీ నాయకుడు విజయ్‌కుమార్ సిన్హా, రెండు చోట్ల ఓటరుగా నమోదు కావడం,రెండు వేర్వేరు ఐడీలు కలిగి ఉండటం కారణంగా ఎన్నికల సంస్థ నుండి నోటీసు అందుకున్నారు. ముఖ్యంగా, నకిలీ ఓటర్లపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరుస విమర్శలు చేస్తున్న సందర్భంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

వివరాలు 

పట్నాలోని బంకిపూర్ నియోజకవర్గంలో కూడా ఆయన పేరు నమోదు

ఇటీవల, బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ కుమార్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారం 'ఎక్స్‌'లో చేసిన పోస్ట్‌లో, విజయ్‌కుమార్ సిన్హా పేరు తన అసెంబ్లీ నియోజకవర్గం లఖిసరై ఓటర్ల జాబితాలో ఉందని పేర్కొంటూ, దానికి సంబంధించిన ముసాయిదా జాబితా స్క్రీన్‌షాట్‌ను పంచుకున్నారు. అంతేకాదు, పట్నాలోని బంకిపూర్ నియోజకవర్గంలో కూడా ఆయన పేరు నమోదు అయ్యిందని ఆధారాలు చూపించారు. ఈ నేపథ్యంలో, ఒకే వ్యక్తి రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో ఉన్న కారణంపై వివరణ కోరుతూ, బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి నోటీసు జారీ చేశారు. ఈ నోటీసుకు ఆగస్టు 14 సాయంత్రం 5 గంటలలోపు సమాధానం ఇవ్వాలని ఆయనను ఆదేశించారు.

వివరాలు 

రెండు వేర్వేరు ఓటరు ఐడీలు కలిగి ఉన్న సిన్హాపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు: తేజస్వి యాదవ్

రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా ఇటీవల ఉప ముఖ్యమంత్రిపై ఇలాంటి ఆరోపణలు చేస్తూ, రెండు వేర్వేరు ఓటరు ఐడీలు కలిగి ఉన్న సిన్హాపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన విజయ్‌కుమార్ సిన్హా, తాను ఒకే ప్రాంతంలోనే ఓటు వేశానని స్పష్టం చేశారు. తేజస్వి యాదవ్ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ, తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

వివరాలు 

బంకిపూర్ జాబితా నుండి తన పేరు తొలగించలేదని వివరణ ఇచ్చిన సిన్హా

తన పేరు రెండు చోట్ల ఉండటానికి గల కారణాలను వివరించిన సిన్హా, మొదటగా తనతో పాటు తన కుటుంబ సభ్యుల పేర్లు బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్ల జాబితాలో ఉన్నాయని తెలిపారు. అయితే 2024 ఏప్రిల్‌లో, లఖిసరై నియోజకవర్గంలో తన పేరును జతచేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. అదే సమయంలో, తనతో పాటు కుటుంబ సభ్యుల పేర్లను బంకిపూర్ జాబితా నుండి తొలగించేందుకు అవసరమైన ఫారమ్ నింపి సమర్పించానని తెలిపారు. కానీ కొన్ని కారణాల వల్ల బంకిపూర్ జాబితా నుండి తన పేరు తొలగించబడలేదని వివరణ ఇచ్చారు.