సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం; ఈసీకి ఫిర్యాదు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పీక్కు చేరింది. వాడివేడీగా మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే తాజాగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. 'కర్ణాటక సార్వభౌమాధికారం'పై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ సోమవారం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. బీజేపీ ప్రతినిధి బృందం దేశ రాజధానిలోని పోల్ ప్యానెల్ కార్యాలయానికి వెళ్లింది. సోనియా గాంధీ ఉద్దేశపూర్వకంగా సార్వభౌమాధికారం అనే పదాన్ని ఉపయోగించారని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 'తుక్డే-తుక్డే' గ్యాంగ్ ఎజెండా అని అందుకే ఇలాంటి పదాలు వాడుతున్నారని, ఈసీ చర్యలు తీసుకుంటుందని మేము ఆశిస్తున్నామని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు.
ఇంతకీ సోనియా గాంధీ ఏమన్నారంటే?
కర్ణాటకలోని హుబ్బలి జిల్లాలో జరిగిన ర్యాలీలో శనివారం సోనియా గాంధీ ప్రసంగించారు. దీన్ని కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ పోస్ట్ చేసింది. 6.5 కోట్ల మంది కన్నడిగులకు బలమైన సందేశాన్ని పంపారని, కర్ణాటక ప్రతిష్ట, సార్వభౌమాధికారం లేదా సమగ్రతకు ముప్పు కలిగించడానికి కాంగ్రెస్ ఎవరినీ అనుమతించదని ఆ పోస్టులో సోనియా గాంధీ చెప్పినట్లు ఉంది. ఇదిలా ఉంటే, భారతదేశం నుంచి కర్ణాటకను వేరుచేయాలని కాంగ్రెస్ బహిరంగంగా వాదిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించిన తర్వాతి రోజే బీజేపీ సోనియాపై చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడం గమనార్హం.