Page Loader
Road Accidents: రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం.. నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్రం
రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం.. నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్రం

Road Accidents: రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం.. నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్రం

వ్రాసిన వారు Sirish Praharaju
May 06, 2025
03:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించే అవకాశాన్ని కల్పిస్తూ కేంద్ర రహదారులు, రవాణాశాఖ సోమవారం రాత్రి ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పథకం సోమవారం నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. గత జనవరిలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులో, రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తులకు గోల్డెన్‌ అవర్‌ సమయంలో తక్షణంగా ఉచిత వైద్యం అందించాలన్న సూచనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఈ పథకానికి 'క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ రోడ్‌ యాక్సిడెంట్‌ విక్టిమ్స్‌ స్కీం-2025' అనే పేరు పెట్టింది.

వివరాలు 

ప్రమాదం జరిగే తేదీ నుండి ఏడవ రోజు వరకు చికిత్స

దేశంలోని ఏ రహదారిపై అయినా మోటారు వాహనాల కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు ఈ పథకం కింద నగదు చెల్లించకుండా (క్యాష్‌లెస్‌) రూ.1.5 లక్షల వరకు వైద్య చికిత్స పొందవచ్చు. ప్రమాదం జరిగే తేదీ నుండి ఏడవ రోజు వరకు ఈ చికిత్స సేవలు వర్తిస్తాయి. ట్రామా లేదా పాలీట్రామా చికిత్స అందించగల సామర్థ్యం కలిగిన ఆసుపత్రులన్నింటినీ ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఈ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.

వివరాలు 

ఆసుపత్రి అందించిన సేవల ఆన్‌లైన్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి 

రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువచ్చిన వెంటనే వైద్య చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. సంబంధిత ఆసుపత్రిలో తగిన సదుపాయాలు లేకపోతే, బాధితుడిని తక్షణమే మరో ఆసుపత్రికి తరలించాలి. ఈ రవాణా ఏర్పాట్ల బాధ్యత కూడా ఆసుపత్రిదే కావాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. చివరగా, బాధితుడు డిశ్చార్జ్ అయిన తర్వాత చికిత్స చేసిన ఆసుపత్రి, అందించిన సేవలకు సంబంధించిన బిల్లును నిర్ణీత ప్యాకేజీ ప్రకారం ఆన్‌లైన్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.