Page Loader
Sonia Gandhi: తక్షణమే జనగణన చేపట్టాలి.. కేంద్రాన్ని డిమాండ్ చేసిన సోనియా గాంధీ
తక్షణమే జనగణన చేపట్టాలి.. కేంద్రాన్ని డిమాండ్ చేసిన సోనియా

Sonia Gandhi: తక్షణమే జనగణన చేపట్టాలి.. కేంద్రాన్ని డిమాండ్ చేసిన సోనియా గాంధీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 10, 2025
01:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా జనగణన నిర్వహించాలని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ డిమాండ్ చేశారు. 140 కోట్ల ప్రజలకు ఆహార భద్రత కల్పించాలనే లక్ష్యంతో యూపీఏ హయాంలో జాతీయ ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. జనగణన జరగకపోవడంతో 14 కోట్ల మంది ప్రజలు ఈ చట్టం ప్రయోజనాలను కోల్పోతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా పథకాలు అమలు చేయడం వల్ల పేద ప్రజలు నష్టపోతున్నారని పేర్కొన్నారు. 2013 సెప్టెంబర్‌లో అమలులోకి వచ్చిన ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ చట్టం దేశంలోని 140 కోట్ల జనాభాకు పోషకాహార భద్రతను అందించడంలో కీలక భూమిక పోషించిందని సోనియా గాంధీ తెలిపారు. గా

Details

జనగణను కేంద్ర ప్రభుత్వం విస్మరించింది

ముఖ్యంగా కోవిడ్‌ మహమ్మారి సమయంలో లక్షలాది కుటుంబాలకు ఈ చట్టం ప్రయోజనం కలిగించిందని అన్నారు. త్వరగా జనగణన చేపడితే మరింత మంది పేదలు లబ్ది పొందుతారని స్పష్టం చేశారు. ఆహార భద్రత ప్రత్యేక హక్కు కాదని, ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కు అని ఆమె రాజ్యసభలో జీరో అవర్‌లో ప్రసంగిస్తూ పేర్కొన్నారు. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎన్డీఏ పాలనలో జనాభా గణన నాలుగేళ్లకు పైగా ఆలస్యమవ్వడం ఆందోళన కలిగిస్తోందని సోనియా గాంధీ విమర్శించారు. 2021లోనే జనగణన జరగాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం దానిని విస్మరించిందని, తిరిగి ఎప్పుడు చేపడతారన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదని అన్నారు.

Details

50శాతం ప్రజలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందే అవకాశం

2011 జనాభా లెక్కల ప్రకారం జాతీయ ఆహార భద్రతా చట్టం ద్వారా 81.35 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందారని ఆమె వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో 75 శాతం, పట్టణ ప్రాంతాల్లో 50 శాతం ప్రజలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారని తెలిపారు. ప్రభుత్వం ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల ఆహార ధాన్యాన్ని ఉచితంగా అందిస్తోందని గుర్తుచేశారు. కేంద్రం త్వరగా జనగణన చేపట్టి కొత్త డేటా ఆధారంగా ఆహార భద్రతా పథకాలను అమలు చేయాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు.