Chandrababu: మే నెలలో తల్లికి వందనం.. బడులు తెరిచే నాటికి టీచర్ పోస్టుల భర్తీ
ఈ వార్తాకథనం ఏంటి
''కేంద్ర ప్రభుత్వ సహాయంతో,ఆర్థికంగా కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మెల్లగా గాడిలో పెడుతున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తాం.
నిబద్ధతతో పనిచేసి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం.రాష్ట్ర పునర్నిర్మాణం కోసం డబుల్ ఇంజిన్ పాలన అవసరమన్న లక్ష్యంతో తెలుగుదేశం, జనసేన, భాజపా కలిసి పనిచేస్తున్నాయి. ప్రజల మద్దతుతో విజయం సాధించాం. ప్రధానమంత్రి సకాలంలో స్పందించి రాష్ట్రానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించారు. ఆ మద్దతు లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి,'' అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
వివరాలు
వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 - అభివృద్ధి లక్ష్యం
ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలవుతున్న హామీలు,సూపర్ సిక్స్ పథకాల అమలు గురించి ముఖ్యమంత్రి శాసనసభలో వివరించారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా,మంగళవారం సాయంత్రం సభలో మాట్లాడారు.
మే నెలలోనే 'తల్లికి వందనం'అందజేయబోతున్నామని,అన్నదాతా సుఖీభవతో పాటు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపడతామని వెల్లడించారు.
''2047 నాటికి అభివృద్ధి చెందే రాష్ట్రంగా మారడమే లక్ష్యం కాదు;ఇప్పటి నుంచే ఆదిశగా వేగంగా ముందుకు సాగడమే మా సంకల్పం.ఈఏడాది రాష్ట్ర వృద్ధి రేటు మంచి స్థాయిలో ఉంది.రాష్ట్రానికి రూ.18,401కోట్ల అదనపు సంపద వచ్చే అవకాశం ఉంది.ప్రతి ఏడాది 15%వృద్ధి రేటు కొనసాగితే,వచ్చే ఐదేళ్లలో మొత్తం రూ.1,38,700కోట్ల అదనపు సంపద సమకూరుతుంది.ఈ మొత్తాన్ని సంక్షేమ పథకాలకే వినియోగిస్తాం.అభివృద్ధి,సంక్షేమం కలిసిన పాలన ఇదే,''అని చంద్రబాబు వివరించారు.
వివరాలు
హామీల అమలుకు స్పష్టమైన షెడ్యూలు
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరుచుకునేలోపు డీఎస్సీ ద్వారా 16,384 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం.
మే నెలలో 'తల్లికి వందనం' నిధులు విడుదల చేస్తాం. పిల్లల సంఖ్యకు సంబంధం లేకుండా అందరికీ అందజేస్తాం.
అన్నదాతా సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20,000 అందజేస్తాం. కేంద్రం ఇచ్చే రూ.6,000కు రాష్ట్రం మరో రూ.14,000 కలిపి చెల్లిస్తాం.
మత్స్యకారులకు చేపల వేట విరామానికి ముందే ఏటా రూ.20,000 అందజేస్తాం.
నిరుద్యోగ యువతకు త్వరలోనే రూ.3,000 భృతి అందిస్తాం.
ప్రభుత్వ ఏర్పాటు జరిగిన ఒక సంవత్సరానికి గుర్తుగా జూన్ 12న 5 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు అందజేస్తాం.
వివరాలు
ఇప్పటికే అమలైన ముఖ్యమైన కార్యక్రమాలు
వృద్ధాప్య పింఛను రూ.3,000 నుంచి ఒకేసారి రూ.4,000కు పెంచాం.
దివ్యాంగులకు రూ.6,000, లెప్రసీ, డయలసిస్ రోగులకు రూ.10,000, మంచం దిగలేని వారికి రూ.15,000 పింఛన్ అందిస్తున్నాం.
ఏటా 64 లక్షల మందికి సామాజిక భద్రతా పింఛన్ల కింద రూ.33,000 కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే.
ఉద్యోగులకు జీతాలు, పదవీ విరమణ చేసిన వారికి పింఛన్లు నెల మొదటి తేదీనే చెల్లిస్తున్నాం.
204 అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంభించాం.
'దీపం' పథకం కింద ఏటా మూడు ఉచిత సిలిండర్లు అందిస్తామని హామీ ఇచ్చాం. ఇప్పటికే ఒకటి అందజేసి, మిగిలినవి త్వరలో ఇవ్వబోతున్నాం. ఇందుకు రూ.2,684 కోట్లు కేటాయించాం.
వివరాలు
డబుల్ ఇంజిన్ పాలన ప్రయోజనాలు
కేంద్ర, రాష్ట్ర ఎన్డీయే ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఉత్పత్తి విలువ పెరిగింది.
2023-24లో రాష్ట్ర వృద్ధిరేటు 8.6% కాగా, 2024-25లో ఇది 12.94% చేరుకోనుంది. ఫలితంగా రూ.62,000 కోట్ల అదనపు సంపద రాబోతోంది.
గత ఏడాది వృద్ధిరేటు 8.6% స్థాయిలో కొనసాగితే, ఉత్పత్తి విలువ రూ.15.44 లక్షల కోట్లు ఉండేది. కానీ వృద్ధి పెరిగి, ఇది రూ.16.06 లక్షల కోట్లకు చేరుకుంది.
వివరాలు
ప్రధానమైన విజయాలు
ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి కేవలం 8 నెలల్లోనే కీలకమైన పనులను పూర్తిచేసింది.
విశాఖ ఉక్కు పరిశ్రమకు ఆర్థిక ప్యాకేజీ, రైల్వే జోన్ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టుకు నిధుల మంజూరు వంటి ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టాం.
మిర్చి రైతులకు క్వింటాల్కు రూ.11,750 మద్దతు ధర నిర్ణయించేందుకు కేంద్రం ముందుకొచ్చింది.
మార్కెట్లో మిర్చి ధర స్థిరంగా ఉండేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాం.
రైతులకు ప్రత్యక్షంగా సహాయం అందించేందుకు రూ.100 కోట్ల నిధి ఏర్పాటు చేస్తున్నాం.