CM Chandrababu: 47 ఏళ్ల క్రితం ఇదే రోజు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం: సీఎం చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ను దేశంలో నంబర్ వన్గా అభివృద్ధి చేయడం తన లక్ష్యమని, తాను చివరి రక్తపు బొట్టువరకు ప్రజలకు సేవ చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖిగా మాట్లాడిన ఆయన, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
ప్రజల ఆశీస్సులతో 47 ఏళ్ల క్రితం ఇదే రోజున ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశానని, 41 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగానని చెప్పారు. 9 ఏళ్లు సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా, మొత్తంగా 14 ఏళ్లు సీఎంగా పని చేశానని గుర్తు చేశారు.
తన చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు తెలుగువారికి న్యాయం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతానని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Details
స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా కృషి
ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 'స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర' లక్ష్యంగా పని చేస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలన్నారు.
రోజుకు 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త రోడ్లపై పడుతోందని, అందులో 51 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మున్సిపల్ సిబ్బంది సేకరిస్తున్నారన్నారు.
అక్టోబర్ 2 నాటికి ఎక్కడా చెత్త కనిపించకుండా చర్యలు తీసుకుంటామని, ఆ బాధ్యత మంత్రి నారాయణకు అప్పగించామన్నారు.
ఇంతకు ముందు 'ఆత్మగౌరవం' పేరుతో మరుగుదొడ్ల నిర్మాణానికి పిలుపునిచ్చామని, మరోసారి 4.6 లక్షల మరుగుదొడ్లను నిర్మిస్తామని చంద్రబాబు వెల్లడించారు.
ఇప్పటికే 72 వేల మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభించామని, ప్రజల సహకారంతో త్వరలోనే లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పారు.