
Jan Aushadhi Stores:ఏపీలో జన ఔషధి స్టోర్లు..ప్రతీ మండలంలో ఒక కొత్త స్టోర్
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీలో వైద్య సదుపాయాలను మెరుగుపరచడం, ఆరోగ్య బీమా విధానాలను సంస్కరించడం,కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం,ఉచిత వైద్య పరీక్షలను అందించడం,యోగా, నేచురోపతి అభివృద్ధి వంటి అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించి, అధికారులు తీసుకోవలసిన పలు సూచనలు ఇచ్చారు. పేద వర్గాలపై వైద్య భారం తగ్గేలా,ప్రతీ మండలంలో జనరిక్ ఔషధాలు అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం భావించారు. దీనికి సంబంధించి వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో సోమవారం సచివాలయంలో జరిగిన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకున్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా పెద్దఎత్తున వచ్చిన దరఖాస్తులను పరిశీలించి,తక్షణమే జన ఔషధి స్టోర్లకు అనుమతులు ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు.
వివరాలు
రూ.25 లక్షల వరకు వైద్య బీమా విస్తరణ
దీనివలన,పేదలకు తక్కువ ధరలో మందులు లభించడమే కాక,బీసీ యువతకు ఉపాధి అవకాశాలు కూడా విస్తృతంగా లభించేందుకు మార్గం సుగుమం అయ్యింది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద రూ.25 లక్షల వరకు వైద్య బీమా అందించే అంశాన్ని సమీక్షలో చర్చించారు. ప్రస్తుతం ఈ బీమా ద్వారా సుమారు 1.43 కోట్ల కుటుంబాలకు మాత్రమే లబ్ధి కల్పిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం 1.43 కోట్ల కుటుంబాలకు మాత్రమే లభిస్తున్న వైద్య బీమాను 1.63 కోట్ల కుటుంబాలవరకు విస్తరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మార్పు అమలైతే సుమారు 5.02 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని అధికారులు తెలిపారు.
వివరాలు
ప్రతీ నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి
ప్రతీ నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేయాలన్న కార్యాచరణ ప్రణాళికను ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోనిలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల పురోగతిపై కూడా చర్చ జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి వెయ్యి జనాభాకు 2.24 పడకలు ఉండగా, WHO ప్రమాణాల ప్రకారం 3 పడకలు ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందువలన, రాష్ట్రంలో మరో 12,756 పడకలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు.
వివరాలు
ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడం
ప్రజలు ఆస్పత్రులకు మాత్రమే చేరకుండా, ముందుగానే జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్య సూత్రాలను పాటించేలా అవగాహన పెంచాలని సీఎం అధికారులకు సూచించారు. ఇందుకోసం యోగా, నేచురోపతి ప్రాధాన్యత పెంచేలా 'యోగా ప్రచార పరిషత్' ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 3 రీజనల్ స్టడీ సెంటర్లలో 64 మంది సభ్యులను నియమించేందుకు అనుమతులు ఇచ్చారు. అమరావతి పరిధిలో నేచురోపతి యూనివర్సిటీ స్థాపనకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
వివరాలు
45 రోజుల్లోగా కుప్పంలో ఉచిత వైద్య పరీక్షలు
ప్రతి వ్యక్తికి వ్యక్తిగత హెల్త్ ప్రొఫైల్ రూపొందించడంలో ఉచిత వైద్య పరీక్షల పైలెట్ ప్రాజెక్టును కుప్పం నియోజకవర్గంలో 45 రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కుప్పం, శాంతిపురం, రామకుప్పం ప్రాంతాలతో పాటు మరిన్ని ల్యాబ్ టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, శాంపిల్ కలెక్షన్ టీమ్లను పెంచాలని స్పష్టంగా సూచించారు. ప్రతీ గ్రామానికి 'ఆరోగ్య రథం' ప్రతీ పల్లెలోనూ మొబైల్ వైద్యసేవలు అందించేందుకు 'ఆరోగ్య రథం' ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. 108 వాహనాల సిబ్బందికి యూనిఫామ్ అమలు చేయాలని ఆదేశించారు. అదనంగా, ఎన్టీఆర్ బేబీ కిట్స్ పథకాన్ని అమలు చేయడానికి ముఖ్యమంత్రి ఇచ్చిన కిట్స్ను పరిశీలించారు. పథకం త్వరలో అమలులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వివరాలు
మోడల్ ఇన్క్లూజివ్ సిటీగా అమరావతి
పెర్కిన్స్ ఇండియా - ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో అమరావతిలో 'మోడల్ ఇన్క్లూజివ్ సిటీ' ఏర్పాటుకు ప్రతినిధులు ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ప్రకారం, సమగ్ర విద్య, సమాన హక్కులు, అందరికీ అందుబాటులో మౌలిక వసతులు కల్పించడం ప్రధాన లక్ష్యం అని తెలిపారు. బారియర్-ఫ్రీ పబ్లిక్ ప్లేస్, ఇన్క్లూజివ్ రోడ్ డిజైన్, అందరికీ అందుబాటులోని ప్రజా రవాణా, డిజిటల్ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ మోడల్ స్కూల్ ప్రోగ్రామ్స్, ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాలు వంటివి రూపకల్పన చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి ఈ అంశంపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాలని సూచించారు.