
CM Chandrababu: క్వాంటమ్ వ్యాలీకి చిరునామాగా అమరావతి.. విట్లో నూతన భవనాలకు ప్రారంభోత్సవం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వం తరఫున యువతకు విస్తృత అవకాశాలు కల్పించేందుకు అవసరమైన ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ ఎదుగుదలకు మార్గం వేసుకోవాలని సూచించారు.
కేవలం ఉద్యోగాల్లోనే సంతృప్తి చెందకుండా, సరికొత్త ఆలోచనలు చేసి, ఆవిష్కరణల ద్వారా స్వయంగా సంస్థలను స్థాపించాల్సిన అవసరముందని దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్ను ఇన్నోవేషన్ వ్యాలీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు. క్వాంటమ్ వ్యాలీకి అమరావతి చిరునామా కానుందని పేర్కొన్నారు.
వివరాలు
త్వరలోనే మరో 100 ఎకరాలు
సోమవారం నాడు అమరావతిలోని విట్ విశ్వవిద్యాలయంలో వి-లాంచ్పాడ్ 2025 స్టార్టప్ ఎక్స్పోను సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
తదుపరి కొత్త బ్లాక్లను ప్రారంభించిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
విట్ వ్యవస్థాపకుడు, ఛాన్స్లర్ విశ్వనాథన్ విట్ ఏర్పాటుకు 200 ఎకరాల భూమి కోరగా, మొదట 100 ఎకరాలు కేటాయించామని, త్వరలోనే మరో 100 ఎకరాలు కేటాయిస్తామని చంద్రబాబు తెలిపారు.
రాబోయే ఏడేళ్లలో 50,000 మంది విద్యార్థులు విట్లో చదివేలా అభివృద్ధి చేయాలని ఆశించారు.
అమరావతిలో స్థాపించే విద్యా సంస్థలు దేశం నలుమూలల నుండి విద్యార్థులను ఆకర్షించేలా ఉండాలని ఆకాంక్షించారు.
అమరావతిలో మొత్తం 5 లక్షల మంది విద్యార్థులు చదివేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
వివరాలు
తెలుగువారి ప్రతిభ ప్రపంచం దాటి..
సిలికాన్ వ్యాలీ నుండి స్పేస్ ఎక్స్, గూగుల్ నుంచి మైక్రోసాఫ్ట్, నాసా నుంచి వాల్స్ట్రీట్ వరకు ఎన్నో రంగాల్లో తెలుగువారు సత్తా చాటుతున్నారని చంద్రబాబు గర్వంతో చెప్పారు.
నాలెడ్జ్ ఎకానమీని మరింత ముందుకు తీసుకెళ్లడానికి యువత కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టాల్సిందిగా సూచించారు.
ప్రత్యేకంగా అన్ని ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.
విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
కొత్త విమానాశ్రయం, మెట్రో రైలు ప్రాజెక్టులతో పాటు గూగుల్ను రాష్ట్రానికి తీసుకురావడం జరుగుతోందన్నారు.
ఆర్సెల్లార్ మిత్తల్ సంస్థ రూ. లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తోందని వివరించారు.
వివరాలు
కష్టపడితేనే విజయపథం..
రాయలసీమలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. అనంతపురం జిల్లాలో లేపాక్షి నుంచి ఓర్వకల్లు వరకు నాలెడ్జ్ హబ్గా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
రాయలసీమను రక్షణ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, డ్రోన్స్, శాటిలైట్ లాంచింగ్ స్టేషన్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ చేపట్టామన్నారు.
డ్రోన్ టెక్నాలజీ భవిష్యత్తులో కీలకం కానుందని, ఓర్వకల్లులో దేశంలో మొట్టమొదటి డ్రోన్ సిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన చంద్రబాబు, తాను చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదువుకున్నానని గుర్తు చేశారు.
తన కుటుంబం ఎదిగిన విధానాన్ని వివరించారు. చిన్నతనం నుంచి కష్టపడిన వారికి జీవితంలో తిరుగుండదని ఉద్బోధించారు.
రాజకీయ రంగాన్ని సేవా వేదికగా భావించి పనిచేస్తున్నట్లు తెలియజేశారు.
వివరాలు
ఇంజినీరింగ్ విద్యార్థులకు అభినందనలు
ఇంజినీరింగ్ విద్యార్థులు ఏర్పాటు చేసిన అంకుర యూనిట్లను సీఎం చంద్రబాబు అభినందించారు.
'వి-లాంచ్ స్టార్టప్ ఎక్స్పో'లో విద్యార్థులు తమ ఆవిష్కరణలు ప్రదర్శించగా, రోబో టెక్నాలజీ, డ్రోన్ సాంకేతికత, విద్యుత్ ఉత్పత్తి, నిర్మాణ రంగ ఉపకరణాలు, ప్రజలకు ఉపయోగపడే వస్తువులను తయారు చేసిన విద్యార్థులను ప్రత్యేకంగా ప్రశంసించారు.
మెరుగైన ఆవిష్కరణలు చేయాలని ప్రోత్సహించారు. ఒక విద్యార్థి ఇచ్చిన నైపుణ్య గణన ప్రజంటేషన్ సీఎం చంద్రబాబును ఆకట్టుకుంది.
వెంటనే ఆ బృందంతో మాట్లాడాలని సీఎంవో అధికారులను ఆదేశించారు.
విద్యార్థులతో కలిసి ఫొటోలు దిగారు. విట్ వ్యవస్థాపకుడు డాక్టర్ జి. విశ్వనాథన్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందించేందుకు సిద్ధమని చెప్పారు.
వివరాలు
అమరావతి అభివృద్ధికి కొత్త ఊపిరి
'ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా మే 2న రాజధాని పనులు పునఃప్రారంభం అవుతాయని చంద్రబాబు ప్రకటించారు. రైతులు తనపై నమ్మకంతో భూములు ఇచ్చారని, ప్రజలకు హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చే బాధ్యతను తనదైన శైలిలో నిర్వర్తిస్తానని చెప్పారు. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, క్వాంటమ్ వ్యాలీకి ఫౌండేషన్ స్టోన్ వేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రఖ్యాతి గాంచిన యూనివర్సిటీలు, పారిశ్రామిక వేత్తలను ఆకర్షించి స్టార్టప్లకు అనువైన వాతావరణం కల్పించనున్నామని వివరించారు. గతంలో చిన్న ఉద్యోగాలకే పరిమితమైన యువత ఇప్పుడు ఐటీ రంగంలో ముందుకు సాగి, ప్రపంచ పౌరులుగా ఎదుగుతోందని చంద్రబాబు గర్వంగా చెప్పారు.