
Revanth Reddy: జపాన్లో తెలంగాణ బ్రాండ్ను ప్రమోట్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటినుండే తెలంగాణ అభివృద్ధికి గ్లోబల్ స్థాయిలో పెట్టుబడులు అవసరమన్న దృక్పథాన్ని వ్యక్తపరిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు వేగవంతం చేశారు.
ఈ దిశగా ఆయన తన తొలి విదేశీ పర్యటనగా జపాన్ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం నేడు (ఏప్రిల్ 16) జపాన్ బయలుదేరుతోంది.
ఏప్రిల్ 16 నుంచి 22వ తేదీ వరకు జరగనున్న ఈ పర్యటనలో ఆయన టోక్యో, మౌంట్ ఫుజీ, ఒసాకా, హిరోషిమా నగరాల్లో పర్యటించనున్నారు.
ఈ పర్యటనలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, స్పెషల్ సెక్రటరీ జయేశ్ రంజన్ కూడా సీఎం వెంట ఉన్నారు.
Details
ఏప్రిల్ 17న టోక్యోలోని ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశం
గతంలో దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా సీఎం రేవంత్ పాల్గొని పెట్టుబడులపై సానుకూల ఫలితాలు సాధించారు. ఈ జపాన్ పర్యటనలోనూ అదే దిశగా ముందడుగు వేయనున్నారు.
పర్యటనలో భాగంగా ఏప్రిల్ 17న టోక్యోలోని ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశమవుతారు. అదే రోజు తోషిబా ఫ్యాక్టరీని సందర్శించి కంపెనీ కార్యకలాపాలను సమీక్షించనున్నారు.
ఏప్రిల్ 18న గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం, టోక్యో గవర్నర్తో సమావేశం, పారిశ్రామికవేత్తలతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు.
ఈరోజే టొయోటా, తోషిబా, ఐసిన్, ఎన్టీటీ వంటి దిగ్గజ సంస్థల సీఈఓలతో వరుస భేటీలు షెడ్యూల్ అయ్యాయి.
Details
హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్లతో భేటీ
సుమిదా రివర్ ఫ్రంట్, మౌంట్ ఫుజీ, అరకురయామా పార్క్, కిటాక్యూషు సిటీ ఎకో టౌన్ ప్రాజెక్టులు, ఎన్విరాన్మెంట్ మ్యూజియం, మురసాకి రివర్ మ్యూజియం లాంటి ప్రాజెక్టులను సందర్శించి సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్రను అధ్యయనం చేయనున్నారు.
ఏప్రిల్ 21న ఒసాకాలో నిర్వహించనున్న వరల్డ్ ఎక్స్పో - 2025లో తెలంగాణకు కేటాయించిన పవిలియన్ను సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు.
అదే రోజు ఒసాకాలో బిజినెస్ రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొననున్నారు. జపాన్ పర్యటన చివరి రోజు ఏప్రిల్ 22న సీఎం రేవంత్ హిరోషిమాకు చేరుకుని పీస్ మెమోరియల్ సందర్శించనున్నారు.
అక్కడ గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్లతో భేటీ అవుతారు.