Page Loader
Revanth Reddy: పాశమైలారం పేలుడు ఘటనపై సీఎం స్పందన.. తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ!
పాశమైలారం పేలుడు ఘటనపై సీఎం స్పందన.. తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ!

Revanth Reddy: పాశమైలారం పేలుడు ఘటనపై సీఎం స్పందన.. తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 30, 2025
04:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన భారీ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల్ని రక్షించేందుకు అత్యవసరంగా అందుబాటులో ఉన్న అన్ని సాధనాలను వినియోగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఈ ప్రమాదం సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలోని సిగాచీ కెమికల్స్ ఫ్యాక్టరీలో చోటుచేసుకుంది. సమాచారం మేరకు, రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో భారీ మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి ఐదుగురు కార్మికులు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, ఆసుపత్రికి తరలించబడ్డ మిగిలిన ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారు.

Details

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి

పేలుడు తీవ్రతతో కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపోయినట్లు తెలుస్తోంది. ఉత్పత్తి విభాగం ఉన్న భవనం పూర్తిగా కూలిపోగా, పక్కనే ఉన్న మరో భవనానికి తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఇక ఈ ఘటనపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సంగారెడ్డి జిల్లా అధికారులతో మాట్లాడి ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' (పూర్వపు ట్విట్టర్‌)లో ఒక పోస్ట్‌ చేశారు. బాధితులకు కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.