AP Rains: వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. ఉప్పాడ తీరంలో అల్లకల్లోలంగా సముద్రం
ఈ వార్తాకథనం ఏంటి
వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
రాయలసీమ జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో కొన్ని చోట్ల జనజీవనం తీవ్రంగా స్తంభించింది.
విశాఖపట్టణం, కాకినాడ తీరంలో పెద్ద ఎత్తున సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి.
విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద అలలు దుకాణాలను తాకుతున్నాయి. వర్షానికి పెదగంట్యాడ మండలం కొంగపాలెంలో రేకుల షెడ్డు కూలింది, దీంతో ఒక వ్యక్తి గాయాలయ్యాయి.
కాకినాడ జిల్లాలోని యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది.
భారీగా రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి.చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇళ్లు నేల కూలాయి.
వివరాలు
తడ వద్ద తీరం దాటిన వాయుగుండం
అంతర్వేది తీరంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. గోదావరి సంగమం వద్ద అలలు ఎగసిపడుతున్నాయి.
పల్లిపాలెంలో ఇళ్లు,బీచ్ రోడ్డును అలలు ముంచెత్తాయి. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం ఓడలరేవు తీరంలో అలలు ఉద్ధృతంగా ఎగసిపడుతున్నాయి.
ఓఎన్జీసీ ప్లాంటును సముద్రపు నీరు తాకింది, ఆక్వా చెరువులను కూడా సముద్రం నీరు ముంచెత్తింది.
తిరుపతి జిల్లా తడ వద్ద వాయుగుండం తీరాన్ని దాటినట్లు వాతావరణశాఖ వెల్లడించింది.
గడిచిన 6 గంటలుగా 22 కి.మీ వేగంతో కదిలి తీరాన్ని తాకినట్లు తెలిపింది. అనంతరం అల్పపీడనంగా బలహీనపడింది.
ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు తీర ప్రాంతాలు, రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తర తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
వివరాలు
నిండుకుండలా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్
జలాశయాలకు చేరుతున్న వరద శ్రీసత్యసాయి జిల్లా సి.కె.పల్లి మండలం వెల్దుర్తి సమీపంలో చిత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
దీంతో వెల్దుర్తి,గంగినేపల్లి తండాలకు,ఎర్రోనిపల్లి,బ్రాహ్మణపల్లి,చిన్నప్పరెడ్డిపల్లి గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి.
వైఎస్సార్ జిల్లాలో గండికోట జలాశయం,మైలవరం జలాశయాలకు వరద నీరు వచ్చి చేరుతోంది.
చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిండుకుండలా మారింది. పైడిపాలెం, వామికొండ, సర్వారాయ సాగర్ జలాశయాలకు కూడా వరద వచ్చి చేరుతోంది.
నెల్లూరు నగర శివారులోని ఆటోనగర్, చంద్రబాబు నగర్, తల్పగిరి కాలనీ, జొన్నవాడ రోడ్డు, పొట్టేపాలెం కలుజు ప్రాంతాల్లో వర్షం కారణంగా రహదారులపై నీరు నిలిచిపోయింది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో బుధవారం రాత్రి వర్షానికి పంట తడిసింది. ఆరబోసిన మొక్కజొన్న, వేరు శనగ తడిసివైపు రైతులకు నష్టం వాటిల్లింది. పలుచోట్ల వరి నీటమునిగింది.