
Gandikota: గ్రాండ్ కాన్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన గండికోట లోయకు యునెస్కో గుర్తింపుపై పరిశీలన
ఈ వార్తాకథనం ఏంటి
గండికోట లోయకు యునెస్కో నుండి గుర్తింపు పొందే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వి.ఎల్. కాంతారావు తెలిపారు.
వైఎస్సార్ జిల్లా గండికోటలో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
గండికోట అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ హాలులో "ఆంధ్రప్రదేశ్లో భౌగోళిక కార్యకలాపాలు" అనే అంశంపై పర్యటన సందర్భంగా పలు శాఖల అధికారులతో సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ, గండికోట ప్రాంతంలోని భౌగోళిక విశిష్టతలు, వనరులు, సాంస్కృతిక నేపథ్యం, చారిత్రక ప్రాధాన్యత వంటి అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక రూపొందించనున్నట్లు చెప్పారు.
వివరాలు
ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా గండికోట
అరుదైన శిలా సంపదతో పాటు, సహజ వనరులు, ప్రాచీన చారిత్రక నేపథ్యం గల గండికోటను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రముగా అభివృద్ధి చేసే వీలుందని ఆయన అభిప్రాయపడ్డారు.
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, గండికోట ప్రాంతాన్ని జైనులు పాలించినట్టు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయని, ఇది సుమారు 900 ఏళ్ల పురాతన నిర్మాణమని తెలిపారు.
పెన్నా నదిపై ఏర్పడిన లోయ, ప్రకృతి అందాలు, సమృద్ధిగా ఉన్న వనరులు ఈ ప్రాంత ప్రత్యేకతని ఆయన వివరించారు.
వివరాలు
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవసరమైన అర్హతలు, ప్రమాణాలు
గండికోట అభివృద్ధిని పీ-4 విధానంలో (పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో) కొనసాగించాలన్న సంకల్పాన్ని ఆయన వ్యక్తం చేశారు.
అలాగే యునెస్కో గుర్తింపును పొందేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.
జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధులు యునెస్కో నుండి గుర్తింపు పొందేందుకు అవసరమైన అర్హతలు, ప్రమాణాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.