కంపెనీలు పేరు మార్చుకున్నట్టే కాంగ్రెస్ ఇండియా పేరుతో కూటమి పెట్టింది : మోదీ
కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు ఇండియా పేరుతో కూటమి ఏర్పాటు చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి మండిపడ్డారు. ఆనాడు గాంధీ క్విట్ ఇండియా నినాదం ఇచ్చారని,ఈనాడు అవినీతిని, బుజ్జగింపు రాజకీయాలను దేశం నుంచి తరిమేసేందుకు మళ్లీ క్విట్ ఇండియా అనాల్సి వస్తోందన్నారు. రాజస్థాన్లో సికార్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు.UPA ప్రభుత్వం చేసిన ఘనకార్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇండియా ముద్ర వేసుకున్నారని మోదీ ఎద్దేవా చేశారు. దేశం పట్ల శ్రద్ధ ఉంటే అంతర్గత వ్యవహారాల్లో విదేశీయుల జోక్యం కోరతారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ను దశాదిశ లేని పార్టీ అన్న మోదీ,కుంభకోణాల్లో చిక్కుకున్న కంపెనీలు పేర్లు ఎలా మార్చుకుంటాయో కాంగ్రెస్ సహా మిత్రపక్షాలు అలాంటి కొత్త పేర్లతోనే వస్తున్నాయన్నారు.