సీఎం జగన్, విజయసాయిరెడ్డిల విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిల విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ఇద్దరు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు ముందుగా అనుమతి కోరుతూ సీబీఐ కోర్టుకు ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ అభ్యంతరాలు చెప్పకపోవడంతో సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలు విదేశీ టూర్లకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో సెప్టెంబర్ 2 నుంచి 9వ తేదీ మధ్యలో యూకే లో చదువుతున్న తన కుమార్తెను చూడటానికి సీఎం జగన్ వెళ్లనున్నారు. ఇక వైసీసీ ఎంపీ విజయసాయి రెడ్డి యూకే, యూఎస్, జర్మనీ, దుబాయ్, సింగపూర్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతులు ఇచ్చింది.
30 రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్న వైసీసీ ఎంపీ
సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి పిటిషన్ పై బుధవారం వాదనలు ముగించి న్యాయస్థానం, నేడు విదేశీ పర్యటనలకు అనుమతిస్తూ ఆదేశాలను జారీ చేసింది. ఇక వచ్చే ఆరు నెలల్లో 30 రోజుల పాటు పలు దేశాల్లో విజయసాయిరెడ్డి పర్యటించనున్నారు. గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ తో పాటు విజయసాయిరెడ్డికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసేందుకు సీబీఐ కోర్టు పలు షరతులు విధించిన విషయం తెలిసిందే. ఇందులో కోర్టు ముందస్తు అనుమతి లేకుండా విదేశీ పర్యటనకు వెళ్లరాదనే షరతు కూడా ఉంది. ఈ మేరకు వారు విదేశీ పర్యటన కోసం అనుమతి కోరారు.