Coaching Centres: కోచింగ్ ఇన్స్టిట్యూట్లను నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కొత్త చట్టం
దిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్లోని ఓ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంతో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. కోచింగ్ ఇన్స్టిట్యూట్లను నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చట్టం తీసుకురావడానికి సిద్ధమవుతోంది. కోచింగ్ ఇన్స్టిట్యూట్లను నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చట్టం తీసుకువస్తుందని, కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో చదువుతున్న విద్యార్థుల నుంచి కూడా సూచనలు తీసుకుంటామని ఆప్ నేత, మంత్రి అతిషి మార్లెనా తెలిపారు.
ఇప్పటి వరకు 30 బేస్మెంట్లను సీజ్ చేశారు
ఎంసీడీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ మాట్లాడుతూ.. బేస్మెంట్లలో నడుస్తున్న కోచింగ్ ఇన్స్టిట్యూట్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. రాజేంద్ర నగర్, ముఖర్జీ నగర్, ప్రీత్ విహార్లలో ఇప్పటివరకు 30 బేస్మెంట్లను సీజ్ చేసినట్లు తెలిపారు. పలు కోచింగ్ సెంటర్లకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఘోర ప్రమాదం ఎలా జరిగింది?
ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్లోని రావు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లో శనివారం సాయంత్రం వర్షం తర్వాత నీరు నిండిపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో కోచింగ్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. ఈ కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు. కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తాతో పాటు కో-ఆర్డినేటర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.