Conspiracy Against PM is Treason!: ప్రధానిపై కుట్ర, దేశద్రోహం.. బాధ్యతారాహిత్యంగా ఎవరిపైనైనా ఆరోపణలు చేయకూడదు: ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ హైకోర్టు బుధవారం ఓ కేసు విచారణ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పై కుట్ర పన్నడం దేశద్రోహంతో సమానమని, అది తీవ్రమైన నేరమని పేర్కొంది. ఆలోచించకుండా ఎవరైనా ప్రధానిపై కుట్ర పన్నారని ఆరోపించలేమని, ఇందుకు పక్కా ఆధారాలు ఉండాలని జస్టిస్ జస్మీత్ సింగ్ అన్నారు. విషయం ఏమిటి? న్యాయవాది జై అనంత్ డెహ్రాయ్పై బిజూ జనతాదళ్(బిజెడి)ఎంపి,సీనియర్ న్యాయవాది పినాకి మిశ్రా దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించినది ఈ కేసు. ప్రధాని నరేంద్ర మోదీపై మిశ్రా కుట్ర పన్నారని డెహ్రాయ్ ఆరోపించారు. ''ప్రధానిపై కుట్ర చేయడం ఐపీసీ ప్రకారం నేరం..అది దేశద్రోహం..మీరు ప్రధానిపై కుట్ర పన్నారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు..దాన్ని నిరూపించాలని,లేకుంటే మీపై నిషేధాజ్ఞలు జారీ చేస్తామని కోర్టు పేర్కొంది.
బీజేపీతో,ప్రధానితో సైద్ధాంతిక అనుబంధం ఉందన్న మిశ్రా
డెహ్రాయ్ తనపై తప్పుడు అవినీతి ఆరోపణలు చేశారని, "కానింగ్ లేన్, ఒడియా బాబు" , "పూరీ కా దలాల్" వంటి అవమానకరమైన పదాలతో తనను సంబోధించారని మిశ్రా అన్నారు. తనకు బీజేపీతో,ప్రధానితో సైద్ధాంతిక అనుబంధం ఉందని, ప్రధానిపై తాను ఎప్పుడూ ఎలాంటి కుట్రలు చేయలేదని మిశ్రా అన్నారు. మిశ్రా,తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు మహువా మొయిత్రా మధ్య జరిగిన సంభాషణను తాను విన్నానని, అందులో ప్రధానిపై ఆరోపణలు చేయమని మిశ్రా మొయిత్రాకు సలహా ఇస్తున్నారని డెహ్రాయ్ చెప్పారు.
మిశ్రాపై సీబీఐలో ఫిర్యాదు చేశా: డెహ్రాయ్
మిశ్రాపై సీబీఐలో ఫిర్యాదు చేశానని,తన వద్ద ఆధారాలు ఉన్నాయని డెహ్రాయ్ చెప్పారు. ఆధారాలు సమర్పించాలని డెహ్రాయ్ను కోర్టు ఆదేశించింది. మీడియాను మాట్లాడకుండా అడ్డుకోబోమని కోర్టు పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణలో డెహ్రాయ్ తన సాక్ష్యాలను సమర్పించనున్నారు. ఆ తర్వాత మిశ్రాపై పరువు నష్టం కేసు పెట్టాలా వద్దా అనేది కోర్టు నిర్ణయిస్తుంది.