Page Loader
Telangana: డెంగీ విజృంభణ.. హైదరాబాద్‌లో 27 కేసులు, నివారణలో జాప్యం! 
డెంగీ విజృంభణ.. హైదరాబాద్‌లో 27 కేసులు, నివారణలో జాప్యం!

Telangana: డెంగీ విజృంభణ.. హైదరాబాద్‌లో 27 కేసులు, నివారణలో జాప్యం! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 23, 2025
02:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

నగరంలో డెంగీ జ్వరాలు పడగ విప్పాయి. దోమకాటుతో బస్తీలు, కాలనీల్లో జ్వర బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్లినా, అక్కడ కూడా దోమల సమస్య తీరడం లేదు. కాలనీలు మాత్రమే కాకుండా, ఆసుపత్రుల్లోనూ దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. నిరుపేద బస్తీలే అధిక ప్రభావం ముఖ్యంగా, నిరుపేదలు నివసించే బస్తీల్లో దోమలను మొదటి ప్రాధాన్యంగా నియంత్రించడం అవసరం. గతేడాది కూడా జీహెచ్‌ఎంసీ బస్తీల్లో జ్వరాలపై శ్రద్ధ పెట్టకపోవడం గమనార్హం. మూసాపేటలో ఓ చిన్నారి డెంగీ జ్వరంతో చనిపోయినట్టు వార్తల్లో వచ్చినప్పటికీ, బాధితురాలి ఇంట్లోనూ, ఆ బస్తీలోనూ బల్దియా నివారణ చర్యలు చేపట్టకపోవడం విమర్శనీయంగా నిలిచింది.

Details

సమాచారం అందకపోవడమే కారణం

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్‌ కలిపి 700 ఆసుపత్రులున్నాయి. వీటికి తోడు, అనధికారికంగా నడిచే ప్రైవేట్‌ క్లినిక్‌లు కూడా అంతే సంఖ్యలో ఉన్నట్టు అంచనా. రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాల సంఖ్య మాత్రం వెయ్యికి పైగా ఉంటుందని భావిస్తున్నారు. డెంగీ ఎలీసా (IgG, IgM) పరీక్షల్లో పాజిటివ్‌ తేలితే, వివరాలను వెంటనే వైద్య ఆరోగ్యశాఖ ద్వారా జీహెచ్‌ఎంసీకి అందించాలి. 24 గంటల్లో ఎంటమాలజీ సిబ్బంది బాధితుల ఇంటికి వెళ్లి రసాయనాల పిచికారీ చేయాలి. కానీ, సమాచారం సరియుగా అందకపోవడంతో నివారణ చర్యల్లో జాప్యం జరుగుతోంది.

Details

 ఒకే రోజులో డెంగీ 27 కేసులు 

గత 3 రోజుల్లో హైదరాబాద్‌ జిల్లాలో 27 డెంగీ కేసులు నమోదయ్యాయి. నిజానికి ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉన్నట్టు అంచనా. ప్రజలను జ్వరాల నుంచి రక్షించడానికి వైద్య ఆరోగ్యశాఖ, ఎంటమాలజీ అధికారులు ఉమ్మడి కార్యాచరణ రూపొందించడం అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు. గుర్రపుడెక్క తొలగించకపోవడమే డెంగీకి కారణం చెరువులు, నాలాల చుట్టుపక్కల ఉన్న కాలనీల్లో దోమల సమస్య విపరీతంగా ఉంది. ముఖ్యంగా, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏడాదంతా ఈ సమస్య ఉంటుంది. చెరువులు, మూసీలో ఏర్పడిన గుర్రపుడెక్కే ప్రధాన కారణం. రెండు, మూడు నెలలకోసారి పొక్లెయిన్‌లతో గుర్రపుడెక్క తొలగించడం తప్ప, అధికారులు శాశ్వత నివారణ చర్యలు చేపట్టకపోవడం వల్ల సమస్య పరిష్కారం కావడంలేదు.

Details

తక్షణం చేయాల్సినవి

గతంలో మాదిరిగా ఇంటింటి తనిఖీలు జరపాలి. ఇళ్లలోని నీటి నిల్వలను తొలగించడం, ప్రజలు-విద్యార్థులకు దోమల నివారణపై అవగాహన కల్పించడం అవసరం. మూడేళ్లుగా చెరువుల్లో గంబూసియా చేపలను వదలకపోవడం వల్ల దోమల లార్వా నియంత్రణలో తీవ్ర లోపం ఏర్పడింది. ఈ చేపలను చెరువుల్లో మళ్లీ ప్రవేశపెట్టి, లార్వా పెరుగుదలను అరికట్టాలి.