ఉద్ధవ్ థాకరే వర్గం సన్నిహితులపై లాండరింగ్ అభియోగాలు.. ఈడీ సోదాలు
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఈ మేరకు శివసేన ఆధ్వర్యంలోని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఈడీ ఆరా తీస్తోంది. కొవిడ్ కాలంలో ఫీల్డ్ ఆస్పత్రుల కేటాయింపులో అవకతవకలు జరిగాయని అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే దర్యాఫ్తులో భాగంగా ముంబయిలోని 15 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఈ జాబితాలో ఐఏఎస్ అధికారి సంజయ్ జైస్వాల్ సహా మాజీ సీఎం ఉద్దవ్ థాకరే వర్గానికి చెందిన కీలక నేత ఆదిత్య థాకరే సన్నిహితుడు సూరజ్ చవాన్ నివాసాలు ఉండటం రాజకీయంగా ప్రకంపణలు సృష్టిస్తోంది. ఉద్దవ్ వర్గం మరో నేత సంజయ్ రౌత్ స్నేహితుడు సుజిత్ పాటేకర్ పైనా ఈడీ సోదాలు ప్రారంభించింది.
మైదాన్ పోలీస్ స్టేషన్ లో కాంట్రాక్ట్ పై ఫిర్యాదు
కరోనా ఫీల్డ్ ఆస్పత్రి స్కాంలో మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలోనే దాడులు జరుగుతున్నాయి. గతంలో సంజయ్ జైస్వాల్ థానే మున్సిపల్ కమిషనర్ గా పనిచేశారు.కొవిడ్ సమయంలో ముంబయి డిప్యూటీ కమిషనర్ పదవిలోనూ విధులు నిర్వర్తించారు. ఇందుకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ స్టేట్ మెంట్ ను నమోదు చేశారు. మరోవైపు సుజిత్ పాటేకర్ పై గతంలోనే మనీలాండరింగ్ అభియోగాలను ఈడీ నమోదు చేసింది. వైద్య ఆరోగ్య సంరక్షణ రంగంలో ఎలాంటి అనుభవం లేకున్నా కీలక కొవిడ్ పరిస్థితుల్లో ఫీల్డ్ ఆస్పత్రి కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. దీన్ని సవాల్ చేస్తూ భాజపా నేత కీర్తి ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతోనే కేసు నమోదైంది.