Page Loader
Kumari Ananthan: మాజీ గవర్నర్ తమిళిసై తండ్రి అస్తమయం

Kumari Ananthan: మాజీ గవర్నర్ తమిళిసై తండ్రి అస్తమయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 09, 2025
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ తండ్రి కుమారి అనంతన్ (Kumari Ananthan) కన్నుమూశారు. చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయనకు 93 సంవత్సరాలు. కొన్ని రోజులుగా వయో సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న అనంతన్ మరణం రాజకీయ, సాహిత్య వర్గాల్లో విషాదాన్ని నింపింది. కుమారి అనంతన్ 1977లో నాగర్‌కోయిల్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాజకీయ ప్రస్థానంలో ఆయన తమిళనాడు అసెంబ్లీలో మొత్తం ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా, సాహితీవేత్తగా కూడా మంచి పేరు సంపాదించారు.

Details

పలువురు రాజకీయ ప్రముఖుల సంతాపం

ఆయన భౌతికకాయాన్ని చెన్నై సాలిగ్రామంలోని కుమార్తె తమిళిసై సౌందర్యరాజన్ నివాసంలో ఉంచారు. ప్రజలు, అభిమానులు ఆయనకు చివరి వీడ్కోలు చెప్పేందుకు అక్కడికి తరలివచ్చారు. తండ్రి మరణవార్తను తమిళిసై స్వయంగా తన ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) ఖాతాలో ప్రకటించారు. పార్లమెంటులో తమిళంలో ప్రసంగించిన తొలి సభ్యుడు తన తండ్రేనని ఆమె గుర్తుచేసుకుంటూ భావోద్వేగపూరితంగా స్పందించారు. కుమారి అనంతన్ పట్ల నివాళులర్పించేందుకు పలు రాజకీయ పార్టీల నేతలు, సాహిత్య ప్రముఖులు ఆయన ఇంటికి విచ్చేసి ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేశారు.