Page Loader
Telangana: గ్రామపంచాయతీ ఎన్నికలు 90 రోజుల్లోనే జరపాలి.. హైకోర్ట్‌ ఆదేశం
గ్రామపంచాయతీ ఎన్నికలు 90 రోజుల్లోనే జరపాలి.. హైకోర్ట్‌ ఆదేశం

Telangana: గ్రామపంచాయతీ ఎన్నికలు 90 రోజుల్లోనే జరపాలి.. హైకోర్ట్‌ ఆదేశం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 25, 2025
11:38 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్ట్‌ బుధవారం కీలక తీర్పును వెలువరించింది. గ్రామపంచాయతీ ఎన్నికలను 3 నెలల్లోపు నిర్వహించాలని, 30 రోజుల్లో వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్ట్‌ న్యాయమూర్తి జస్టిస్‌ టి. మాధవీదేవి ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం 2024 జనవరి 30న ముగిసినప్పటికీ, ఇప్పటివరకు ఎన్నికలను నిర్వహించడం ఎందుకు జాప్యం అవుతోందని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని హైకోర్ట్‌ ప్రశ్నించింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ పలువురు మాజీ సర్పంచులు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్‌ టి. మాధవీదేవి, ఇవాళ తీర్పును వెల్లడించారు.

Details

పిటిషనర్ల వాదనలు 

పిటిషనర్ల తరఫున న్యాయవాదులు 'గతేడాది జనవరి 31న సర్పంచుల పదవీకాలం ముగిసింది. అప్పటినుండి ఎన్నికలు నిర్వహించకపోవడమే కాకుండా పంచాయతీల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించడం రాజ్యాంగానికి, తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టానికి విరుద్ధం. ప్రత్యేక అధికారులు ఇతర విధులకే కేటాయించబడటంతో పంచాయతీ సమస్యలు పట్టించుకోవడంలేదు. ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా నిధులు ఇస్తామంటూ హామీ ఇవ్వడంతో పలువురు సర్పంచులు స్వంత నిధులతో అభివృద్ధి పనులు చేశారు. కానీ, ఇప్పుడు నిధులు రాక వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర పథకాలకింద నిధులూ రాక గ్రామాల అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. కాబట్టి వెంటనే ఎన్నికలు నిర్వహించడం లేదంటే పాత సర్పంచులకే బాధ్యతలు అప్పగించడం సముచితమని వాదించారు.

Details

 ప్రభుత్వం తరఫున వాదనలు 

ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ, ''సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల ప్రక్రియ చేపట్టాలి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో నెల రోజుల సమయం కావాలని తెలిపారు. ఎన్నికల సంఘం తరఫున వాదనలు ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది జి. విద్యాసాగర్ మాట్లాడుతూ, 'రిజర్వేషన్లు ఖరారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అది పూర్తి కాగానే ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తాము. ప్రభుత్వం అనుమతిస్తే రెండు నెలల్లో ఎన్నికలను నిర్వహించడం సాధ్యమేనని తెలిపారు.

Details

కోర్టు జోక్యం 

న్యాయమూర్తి ఈ సందర్భంలో ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తూ, 'గతంలో ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చాకా ఎందుకు అమలు చేయలేదు? సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోతే, ఎన్నికల సంఘం స్వయంగా చొరవ తీసుకోవాలని. అది ఎందుకు చేయలేదని నిలదీశారు. మూడు నెలల్లో గ్రామపంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని, 30 రోజుల్లో వార్డుల విభజన పూర్తి చేయాలని తుది తీర్పులో జస్టిస్‌ టి. మాధవీదేవి రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి కచ్చితంగా ఆదేశించారు.